బంజారాహిల్స్/హిమాయత్నగర్ ,నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందే అని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇందిరాపార్కువద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమానికి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి భారీగా టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్లనుంచి కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఫిలింనగర్లోని శంకర్ విలాస్ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ర్యాలీగా కార్యకర్తలు ఇందిరాపార్కుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తుందన్నారు.
వానకాలంలో పండిస్తున్న ధాన్యం కొనుగోలుపై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం వైఖరితో రాష్ట్రంలోని రైతులు ఇబ్బందులు పడుతుంటే ..రెండోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వారిని రెచ్చగొట్టేలా కొనుగోలు కేంద్రాల వద్ద పర్యటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, రాములు చౌహాన్, విష్ణునాయక్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్నుంచి కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి నాయకత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇందిరాపార్కువద్ద ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్, మహిళా అధ్యక్షురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.