హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తోపాటు, వీ6, రాజ్న్యూస్ టీవీ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)ని టీఆర్ఎస్ కోరింది. ఈటల రాజేందర్ ఏకంగా పోలింగ్ బూత్లోనే మీడియా సమావేశం నిర్వహించి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించింది. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ ఢిల్లీలో సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈటల రాజేందర్ పోలింగ్ జరుగుతుండగానే కమలాపూర్ మండలంలోని 262 పోలింగ్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారని, అదే సమయంలో ఆయన భార్య జమున బూత్లో ఉన్న ఓటర్లకు పోల్చిట్టీలు పంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఆయన ఎన్నికల కమిషన్కు సమర్పించారు. వీ6, రాజ్న్యూస్ చానెళ్లు పదేపదే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆధారాలను సీఈవోకు సమర్పించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈటల ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆధారాలతో సహా అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.