హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజలే ముఖ్యమంత్రి కేసీఆర్ బలమని, తెలంగాణ ప్రజల కోసమే, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించే లక్ష్యంతోనే టీఆర్ఎస్ను స్థాపించారని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలిపారు. నాడు ఉద్యమ సారథిగా, నేడు పాలకుడిగా సీఎం కేసీఆర్ గ్రాండ్ సక్సెస్ అయ్యారని అన్నారు. నాడు తెలంగాణ వ్యతిరేక శక్తులతో ‘జై తెలంగాణ’ అనిపించారని, నేడు కేవలం ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని గుర్తుచేశారు.
ఈ నెల 27తో టీఆర్ఎస్ స్థాపించి 21 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 21 ఏండ్ల పార్టీ ప్రస్థానాన్ని.. అంతకుమించి సీఎం కేసీఆర్తో స్నేహాన్ని గుర్తుచేసుకొన్నారు. ఆ విశేషాలు
ఆయన మాటల్లోనే..రాష్ట్ర ఏర్పాటును దైవకార్యంగా భావించారు
కేసీఆర్తో నాకు 1985 నుంచి సాన్నిహిత్యం ఉన్నది. ఉమ్మడి పాలనలో ప్రతి రంగంలో తెలంగాణ ప్రాంతంపై జరుగుతున్న వివక్షను, ప్రజలు పడుతున్న కష్టాలను ఆయన కండ్లారా చూశారు. వీటికి అడ్డుకట్ట పడాలంటే రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని బలంగా విశ్వసించారు. పార్టీ ఏర్పాటు కంటే ముందే రాష్ట్ర సాధనను దైవకార్యంగా, పవిత్రకార్యంగా స్వీకరించారు.
‘సాధిస్తా లేదా చస్తా’ అని నిర్ణయించుకోవడం ఆయనకే చెల్లింది. సాధారణంగా ఒక పార్టీని స్థాపించడానికి 3 రకాల పరిస్థితులు ఉంటాయి. సానుకూలం (ప్రజలంతా కొత్త పార్టీ కోసం ఎదురు చూడటం), తటస్థం, రాజకీయ శూన్యత ఉండటం. కానీ, టీఆర్ఎస్ మాత్రం అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ఏర్పడింది. కాంగ్రెస్, టీడీపీ రూపంలో బలమైన పార్టీలు ఏలుతున్న సమయంలో కుల, ధన బలం లేకున్నా, ప్రజల్లో విశ్వాసం, మీడియా సహకారం లేకున్నా పార్టీని ప్రారంభించారు. ప్రజలే తన బలంగా మారుతారని విశ్వసించి ముందుకు నడిచిన వ్యక్తి కేసీఆర్.
కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కోసమే. ఇందులో భాగంగానే వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకొన్నారు. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. మొదటిది.. తెలంగాణ ఊసెత్తని శక్తులతో జై తెలంగాణ అనిపించడం. దానికి వాళ్లు కట్టుబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ కట్టుబడి ఉంటే తెలంగాణ రాష్ట్రం త్వరగా సిద్ధిస్తుంది. రెండోది.. ఒకవేళ వాళ్లు తెలంగాణకు కట్టుబడి లేకుంటే వాళ్ల నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది. రాష్ట్ర సాధన కోసం కష్టపడుతున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని అందరికీ అర్థమవుతుంది. ఈ విషయంలో కేసీఆర్ విజయం సాధించారు. పార్టీని చీల్చడానికి ఎన్నో కుట్రలు జరిగినా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకొందామని రాజీనామాల అస్ర్తాన్ని ఎంచుకొన్నారు.
నాకు తెలిసి స్వాతంత్య్రం తర్వాత దేశంలో టీఆర్ఎస్ జరిపినన్ని సభలు, సమావేశాలు ఎవరూ చేయలేదు. ఉద్యమ సమయంలో ఏకకాలంలో నాలుగు తరాలవాళ్లు జై తెలంగాణ అన్నారు. ఉదాహరణకు.. ఒక పాపకు నాలుగేండ్లు.. ఆమె తల్లి/తండ్రికి 25 ఏండ్లు.. వాళ్ల తల్లి/తండ్రికి 50 ఏండ్లు.. వాళ్ల తల్లి/తండ్రికి 75-80 ఏండ్లు. ఇలా ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదనుకుంటా. ఉద్యమ సమయంలో వెయ్యి కార్లతో చలో ఢిల్లీ చేపట్టాం. అప్పటికి పార్టీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రాత్రిళ్లు మేమంతా పెన్గంగ, నర్మదానది తీరాల్లో ఇసుక తిన్నెల్లో పడుకొన్నాం. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఎక్కువ దూరం కేసీఆరే స్వయంగా కారు నడిపారు.
ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి కాంగ్రెస్, బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఏలాయి. అనేక రా ష్ర్టాలను పాలిస్తున్నాయి. కానీ, కేసీఆర్తో సమానం గా ఫలితాలు సాధించే సత్తా ఈ రెండు పార్టీలకు ఉన్న దా? అని ప్రజలు ఒకసారి విశ్లేషించుకోవాలి. తెలంగాణ 8 ఏండ్ల కిందట 28వ రాష్ట్రంగా ఏర్పడింది. కానీ ఇప్పుడు 75 ఏండ్ల కిందట ఏర్పడిన రాష్ర్టాలను కూడా చాలెంజ్ చేస్తున్నది. లెక్క ప్రకారం అనేక సూచీ ల్లో తెలంగాణ.. దేశంలో 28వ స్థానంలో ఉండాలి. కానీ నేడు ఏ రంగంలో చూసినా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దీనికి కారణం టీఆర్ఎస్. అన్ని రంగా ల్లో యూపీ చివరి స్థానంలో ఉన్నది. దీనికి కారణం కాంగ్రెస్, బీజేపీ. ప్రపంచంలో అనేక దేశాలు హిమగి రి శిఖరంవైపు దూసుకెళ్తుంటే, భారత్ మాత్రం కాంగ్రె స్, బీజేపీ ఏలుబడిలో పాతాళం వైపు పోతున్నది.
1) లక్ష్యాన్ని సాధించాలన్న తపన
2) అనుకున్న అంశం పట్ల సంపూర్ణ అవగాహన
3) అచంచలమైన ఆత్మవిశ్వాసం
4) సాధించడానికి అనుగుణమైన కార్యాచరణ.
ఈ లక్షణాలన్నీ కేసీఆర్లో పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే నాడు ఉద్యమ నాయకుడిగా, నేడు పాలకుడిగా గ్రాండ్ సక్సెస్ అయ్యారు.
చాలా మంది నాయకులకు ఉద్యమాన్ని నడిపే సత్తా ఉంటుంది కానీ, పాలన కొనసాగించే పరిణతి ఉండదు. కానీ సీఎం కేసీఆర్ రెండు పాత్రల్లోనూ ఘన విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్నెల్లలో కరెంటు సమస్య పోతదని ఎవరైనా ఊహించారా? వర్షాకాలంలో కూడా నిండని చెరువులు, నీళ్లు లేని ప్రాజెక్టులను చూసిన తెలంగాణ.. నేడు ఎండాకాలంలోనూ మత్తడి దుంకుతున్న చెరువులను చూస్తున్నది.
ఉద్యమ సమయంలో ఏ ఊరికి పోయినా మాకు తాగునీళ్లు లేవు, కరెంటు రాదు, చెరువు పడావు పడ్డది, బడి కూలిపోయేటట్టు ఉన్నది అని చెప్పేటోళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైంది. సాధారణంగా ప్రభుత్వాలు అడిగినా చేయవు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు అడగకున్నా వారికి ఏమేం కావాలో ఆలోచించి చేస్తున్నది. కల్యాణలక్ష్మి మొదలు దళితబంధు వరకు అనేక పథకాలు ఇందుకు ఉదాహరణ.
రాష్ట్రం సాధించిన తర్వాత ఎలా అభివృద్ధి చేయాలో సీఎం కేసీఆర్ ముందే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకొన్నారు. ఏయే రంగాల్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలో ప్రణాళిక రచించుకొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేసి తెలంగాణను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపారు.