వరంగల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించారు. ఏకగ్రీవంగా ఎన్నికై తిరుగులేని విజయాన్నందుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి రెండోసారి ఎమ్మెల్సీ అయ్యారు. తొలిసారిగా 2019 జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పోచంపల్లి, అత్యధిక మెజారిటీతో గెలిచారు. పోలైన ఓట్లలో 97.35 శాతం దక్కించుకుని దేశంలోనే అరుదైన రికార్డును నమోదు చేసుకున్నారు. ఆ ఎన్నికలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 902 ఓట్లు ఉన్నాయి.
883 పోలయ్యాయి. 12 ఓట్లు చెల్లలేదు. ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు పోటీ చేయగా టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లికి 848 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్రెడ్డికి 23 ఓట్లు పడ్డాయి. మిగిలిన ముగ్గురికి ఒక్క ఓటూ రాలేదు. చెల్లిన ఓట్లలో 97.35 శాతం పోచంపల్లికి పడ్డాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత ఎక్కువ శాతం ఓట్లు ఎవరూ సాధించలేదు. ఇది దేశంలోనే అరుదైన రికార్డుగా నమోదైంది. తాజాగా మన రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరు ఏకగ్రీవం కాగా మిగిలిన ఆరు స్థానాలకు ఎన్నిక జరిగింది.
మంగళవారం ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 89 శాతం ఓట్లతో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ విజయం సాధించారు. దీంతో పోచంపల్లి దరిదాపుల్లోకి ఎవరూ రాలేదు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పోచంపల్లి వివాద రహితుడు. వరికోలు శ్రీమంతుడిగా పేరుంది. ఇప్పుడు మిగతా పార్టీలకు కొంత బలం ఉన్నా పోచంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ వేసిన వాళ్లు కూడా ఉపసంహరించుకున్నారు. ఒకసారి రికార్డు స్థాయి ఓట్లతో, ఇప్పుడు ఏకగ్రీవంతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
మండలాలు, గ్రామాలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పునర్విభజనతో గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఓట్లు పెరిగాయి. అయినా అత్యధిక మెజారిటీ రికార్డు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పేరిటే ఉంది. తాజా ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఘన విజయం ఇలానే ఉంది.
బలం కంటే ఎక్కువ..
2019 జూన్లో ఉప ఎన్నిక జరిగినప్పటికి ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి టీఆర్ఎస్కు 680 మంది, కాంగ్రెస్కు 169 మంది మద్దతుదారులున్నారు. మరో 53 మంది స్థానిక సంస్థల ఎన్నికలో స్వతంత్రులుగా గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి రికార్డు స్థాయి ఓట్లు సాధించేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేసి విజయవంతమయ్యారు. టీఆర్ఎస్కు ఉన్న 680 మందికి అదనంగా 53 మంది స్వతంత్రులతోపాటు 115 మంది కాంగ్రెస్ మద్దతుదారులు శ్రీనివాస్రెడ్డికి ఓటు వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, స్వతంత్రులు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో రికార్డు స్థాయి విజయం దక్కింది. ఉద్యమాల ఖిలా వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తాజాగా మరోసారి టీఆర్ఎస్ విజయపతాకం ఎగురవేసింది. 2015, 2021 సాధారణ ఎన్నికల్లో ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2019లో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచింది.
సొంతూరు నుంచి..
హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్కు చెందిన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి ముందే సొంతూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ నిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీల సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నారు. పోచంపల్లి పదవీకాలం 2022 జనవరి 4 వరకు ఉంది. అనంతరం రెండో దఫా పదవీకాలం మొదలుకానుంది. ప్రస్తుత ఎన్నిక పదవీకాలం 2028 వరకు ఉంటుంది. శాసనమండలిలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అధిక ప్రాతినిధ్యం లభించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లా నుంచి ఏకంగా ఎనిమిది మందికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రస్తుత ఎమ్మెల్సీల్లో ఐదుగురు హనుమకొండ జిల్లా వారే ఉన్నారు. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎస్ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
పేరు : పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
తల్లిదండ్రులు : సమ్మక్క-జనార్దన్రెడ్డి
పుట్టిన తేదీ : 17-04-1975
భార్య : మమత
కూతురు : ఆశ్రిత
విద్యార్హత : ఎంబీఏ
రాజకీయ అనుభవం : టీఆర్ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, 2019 జూన్ 3 నుంచి వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
అడ్రస్ : వరికోల్ గ్రామం, నడికూడ మండలం, హనుమకొండ జిల్లా.