దివ్యాంగురాలికి కొప్పుల సాయం
మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రాజవ్వ
గొల్లపల్లి, మార్చి 6: ‘నడువలేని స్థితిలో ఇంట్లోనే ఉంటున్న.. అందరిని కలువాలని ఉన్నా వెళ్లలేకపోతు న్న.. సారూ, దయచేసి నాకు బండిప్పించండి’ అంటూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గుల్లకోటకు చెందిన దివ్యాంగురాలు వేముల రాజవ్వ మంత్రి కొప్పులను కోరింది. శనివారం తన పొరుగూరైన చందోలికి మంత్రి వస్తున్నట్టు తెలుసుకున్న ఆమె ఆటోలో అక్కడికి వెళ్లింది. మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రిని కలిసి తనగోడు వెళ్లబోసుకున్నది. ఆమె దయనీయస్థితిని చూసి కొప్పుల చలించిపోయారు. వెంటనే దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారికి ఫోన్ చేశారు. జగిత్యాలలో ట్రై సైకిల్ ఉందని సదరు అధికారి చెప్పగా వెంటనే తన వాహనాన్ని పంపించి తెప్పించాడు. సరిగ్గా సాయంత్రం 4.35 గంటలకు బ్యాటరీ ట్రై సైకిల్ను దివ్యాంగురాలికి అందజేశారు. కొత్త బండిలో కూర్చోని రాజవ్వ మురిసిపోయింది. అడిగిన వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.