ఆదిలాబాద్ : కొవిడ్-19 బారిన పడి బలవంతంగా ఊరి అవతల పొలంలో ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చిన గిరిజన విద్యార్థిని తిరిగి గ్రామంలోకి ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడావి సోన్దేవి గురుకులంలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల కొవిడ్-19 బారిన పడింది. దీంతో యువతిని గ్రామస్తులు ఊళ్లోకి రానివ్వలేదు. చేసేదిలేక ఊరి చివరన ఉన్న తమ పొలంలోనే విద్యార్థిని ఐసోలేషన్లో ఉంటుంది. రాత్రుళ్లు చిమ్మ చీకట్లో గుడుపుతోంది.
సమాచారం తెలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి గ్రామ పెద్దలతో చర్చించి వారికి భరోసా కల్పించడంతో విద్యార్థిని ఊళ్లోకి ప్రవేశించింది. వైద్యులకు చూపించుకోవాల్సిందిగా బాలికకు సూచించింది. స్థానిక వైద్యాధికారి తన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు విద్యార్థిని తెలిపింది.