దోమలగూడ, డిసెంబర్ 29: ట్యాంక్బండ్పై బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లిదండ్రులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాంధీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గంలో నివాసముంటున్న శివకుమార్, సమత దంపతులు. వీరికి కూతురు సిరి(3). బెల్లంపల్లిలో ఉన్న తల్లిగారి ఇంటికి రైలులో వెళ్లేందుకు సమత కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు టికెట్ బుక్ చేసింది. ఆ రైలు సికింద్రాబాద్ నుంచి బుధవారం ఉదయం 5.18 నిమిషాలకు బయలు దేరుతుంది. దీంతో బుధవారం తెల్లవారుజామున క్యాబ్ బుక్ చేసుకున్న వీరు రాయదుర్గంలోని ఇంటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. తెల్లవారు జామున 4. 30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు ట్యాంక్ బండ్ పైకి చేరుకుంది. ఆ సమయంలో వేగంగా దూసుకువచ్చిన ట్రావెల్ బస్ కారును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారందరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి సిరి మరణించింది. గాయాలైన శివకుమార్, సమతను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించినట్లు సీఐ మోహన్ రావు తెలిపారు.