మందమర్రి రూరల్, మార్చి 19 : సింగరేణి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి దొరుకుతున్నది. పలు వృత్తి విద్యా కోర్సుల్లో ఉచితంగా శిక్షణనిస్తూ వారు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దోహదపడుతున్నది. నిరుద్యోగ యువతకు చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నది. మందమర్రి ఏరియా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో పాటు ఇక్కడున్న కార్మిక కుటంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 2000 సంవత్సరంలో ఏరియాలో సింగరేణి సేవా సమితిని స్థాపించారు. ముందుగా మహిళలకు అక్షరాస్యతతో మొదలైన సేవలు అనేక వృత్తి విద్య, ఉపాధి కోర్సులుగా విస్తరించాయి. ప్రస్తుతం టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, బ్యూటీషియన్, డ్రైవింగ్, కంప్యూటర్, బొమ్మల తయారీ, చీరెలకు రంగులు అద్దడం, సెల్ఫోన్ రిపేరింగ్, క్యారీ బ్యాగ్స్ మేకింగ్ లాంటి వృత్తుల్లో మహిళలకు శిక్షణనిస్తున్నారు. యువకులకు హెవీ మోటర్ డ్రైవింగ్, ఆర్మీ రిక్రూట్మెంట్, సెక్యూరిటీ గార్డు వంటి ఉద్యోగాల కోసం తర్ఫీదునిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ వృత్తుల్లో 12వేల మంది శిక్షణ పొందారు. మరో నాలుగు వేల మంది శిక్షణలో ఉన్నారు. వీరికి శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి సింగరేణి సర్టిఫికెట్లు ఇస్తున్నది.
మహిళలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, శిల్పారామం లాంటి పెద్ద సంస్థలో అవకాశం కల్పిస్తున్నారు. ఏరియాలో శిక్షణ పొంది తయారు చేసుకున్న వస్తువులను ఇలాంటి సంస్థల ద్వారా అమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. సింగరేణి ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో స్టాల్స్ నెలకొల్పేందుకు అవకాశం ఇస్తున్నది. వీటి ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కొందరు తాను నేర్చుకున్న యూనిట్ను ఇంటి వద్దే ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా స్థిర పడ్డారు. ఎంపిక చేసిన యువతను సింగరేణి తన సొంత ఖర్చులతో బెంగళూరు లాంటి ప్రదేశాలకు పంపించి హెవీ మోటర్ డ్రైవింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నది. వారిని స్థానిక ఓసీలో కాంట్రాక్ట్ ఉద్యోగి కింద ఉపాధి కల్పించారు. మరికొంత యువకులకు హైదరాబాద్లోని సైనిక్ అకాడమీలో శిక్షణ ఇప్పించి ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా అవకాశం కల్పించారు. జీఎంఆర్ కంపెనీ ద్వారా యువతకు మోటర్, టీవీ, సెల్ మెకానిక్తో పాటు ఎలక్ట్రికల్ వస్తువుల రిపేర్ లాంటి అంశాలపై తర్ఫీదునిస్తున్నారు. ఇలా సుమారు నాలుగు వేల మంది యువతీయువకులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. సింగరేణి సేవా సమితి సమీప గ్రామాల్లో వివిధ రకాల సేవలు అందిస్తున్నది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి సేవా సమితి ద్వారా అనేక అంశాల్లో ఉచితంగా శిక్షణనిస్తున్నాం. కొందరు శిక్షణ తీసుకొని ఇంట్లోనే ఉండిపోతున్నారు. అలా కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేర్చుకున్న యూనిట్ ద్వారా ఉపాధి పొందాలి. అప్పుడే శిక్షణకు ప్రయోజనం ఉంటుంది. మందమర్రి ఏరియాలో చాలా మంది యువతీ యువకులు, మహిళలు పలు వృత్తుల్లో శిక్షణ పొందుతున్నారు. వారు స్వయంగా యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ మంచి స్పందన ఉంది. యువత మరింత ముందుకురావాలి. సింగరేణి కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
– చింతల లక్ష్మీశ్రీనివాస్, సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు, మందమర్రి
సింగరేణి సేవా సమితి ద్వారా ఉచితంగా ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్లో శిక్షణ పొందా. దాని ఆధారంగా మందమర్రి ఏరియా స్టేషన్ రోడ్లో యూనిట్ను సొంతంగా ఏర్పాటు చేసుకున్నా. నా భర్తకు ఉద్యోగం లేదు. ఆరు నెలలు శిక్షణ పొంది రెండు నెలల క్రితమే యూనిట్ను ప్రారంభించా. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ప్రతినెలా సుమారు రూ.8 నుంచి రూ.10 వేల వరకు సంపాదించాలని అనుకుంటున్నా. ఇది మా కుటుంబ పోషణకు ఆధారంగా నిలుస్తున్నది. ఉచితంగా శిక్షణనిచ్చి నాకు ఉపాధి మార్గాన్ని చూపిన సింగరేణి సేవా సమితికి ఎప్పుడూ రుణపడి ఉంటా.
– సాయిలీల, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గంవర్క్
సింగరేణి సంస్థ నాకు ఉపాధి మార్గాన్ని చూపింది. నేను సేవా సమితి ద్వారా టైలరింగ్లో శిక్షణ పొందా. తండ్రి చనిపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ తరగతుల్లో చేరా. మూడు నెలలు శిక్షణ తీసుకున్నా. కొంత డబ్బుతో ఆర్కేపీ అల్లూరి సీతారామరాజు నగర్లో చిన్న యూనిట్ను ప్రారంభించా. ప్రస్తుతం నెలకు రూ.6 వేలు వస్తున్నాయి. కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బంది లేదు. సింగరేణి సంస్థ ద్వారా నాకు ఎంతో మేలు జరిగింది.
– యెన్నమల్ల స్రవంతి, ఆర్కేపీ