హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సమాజంలో నిరాదరణకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం ఉపాధితోవ చూపిస్తున్నది. భిక్షాటన, పడుపువృత్తే జీవనాధారంగా బతుకు వెళ్లదీస్తున్న ఈ వర్గాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ అక్కున చేర్చుకుంటున్నది. వారికి జనపనార సంచుల (జ్యూట్ బ్యాగ్స్) తయారీలో ప్రత్యేక శిక్షణ కార్యాక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ కూకట్పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో తొలిదశలో 50 మందికి శిక్షణనిస్తున్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యమే కాకుండా రోజుకు రూ. 200 ఉపకార వేతనాన్ని అందిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి శాశ్వత ఉపాధిని అందించి సమాజంలో వారికి గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సర్కారు చేయూతనిస్తున్నదని శిక్షణ తీసుకుంటున్న ట్రాన్స్జెండర్లు పేర్కొన్నారు. తన కెరీర్లో మొదటిసారిగా ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇస్తున్నామని, వారు ఆసక్తిగా నేర్చుకుంటున్నారని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఇన్చార్జి లక్ష్మికుమారి తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వటమే కాకుండా అన్ని రకాలుగా అండగా నిలవడం గొప్ప పరిణామమని శిక్షణలో భాగస్వామి అయిన ప్రభావన ఎన్జీవో నిర్వాహకురాలు దీప పేర్కొన్నారు. వారికి ఆర్థికంగా భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ ఏజీఎం సబిత పేర్కొన్నారు.