మామిళ్లగూడెం, మార్చి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శిక్షణ పొందేందుకు 23 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్తో పాటు ఇతర సివిల్ సర్వీసులకు ఎంపికైన శిక్షణ అధికారులు సోమవారం నుంచి ఈ నెల 12 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే వివిధ కేటగిరీల్లో ఢిల్లీలో శిక్షణ పొందిన వీరు జనవరి 19 నుంచి హైదరాబాద్లోని ఎంహెచ్ఆర్డీలో పలు విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజల జీవన విధానాలను అవగాహన చేసేందుకు జిల్లాలో పర్యటించనున్నారు. వీరికి క్షేత్ర స్థాయిలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు నియమితులయ్యారు. మండల, గ్రామస్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలను కేటాయిస్తూ కలెక్టర్ వీపీ గౌతమ్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చేరుకున్న సివిల్ సర్వీసెస్ అధికారులు ముందుగా కలెక్టర్ వీపీ గౌతమ్ను ముందుగా మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం ఐదు బృందాలుగా గ్రామాల్లోకి వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేస్తారు.