‘నగరం శరవేగంగా వృద్ధి చెందుతున్నది. అన్నివైపులా గృహ, వాణిజ్యసముదాయాలు వెలుస్తున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు త్వరలో ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్(టీఐఏ) నూతన పాలసీ తీసుకరాబోతున్నాం. ఈ పాలసీ ముసాయిదా తుదిరూపు దిద్దుకుంటోంది. రెండునెలల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ విధానం అమల్లోకి వస్తే దేశంలోనే తొలిసారి అమలు చేసిన ఘనత హైదరాబాద్కు దక్కుతుంది. నూతన మార్గాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ను అమలు చేస్తాం’ అని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు. గురువారం క్రెడాయ్ తెలంగాణ రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన నూతన పాలసీ గురించి వివరించారు.
మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)విధానాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. మరో రెండు నెలల్లో టీఐఏ పాలసీ తీసుకొచ్చే నగరంగా దేశంలోనే హైదరాబాద్కు తొలిస్థానం దక్కనుందన్నారు. కొత్త మార్గాల్లో పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని టీఐఏను అమలు చేస్తామని, దీనిపై కసరత్తు జరుగుతుందన్నారు. డెవలపర్లు, బిల్డర్ల కోసం క్రెడాయ్ తెలంగాణ రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) బుక్ను అర్వింద్కుమార్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ 2015 నుంచి హైదరాబాద్ పురోగతి వృద్ధిరేటు పెరుగుతుందని, స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టు పరిధిలోని 28 బ్లాకులను వేలం వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్వింద్కుమార్ తెలిపారు. వీటిని అభివృద్ధి చేసి విక్రయించే బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించే దిశగా కసరత్తు జరుగుతుందన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి హెచ్ఎండీఏ తీసుకుని ఈ-వేలం నిర్వహిస్తామని, బిల్డర్ల ద్వారా కస్టమర్కి సేల్స్ జరిపే విధంగా ఆలోచన చేస్తున్నామని, రాబోయే ఆరు వారాల్లోగా స్పష్టత వస్తుందని అర్వింద్కుమార్ స్పష్టం చేశారు.
గ్రేటర్ పరిధిలో లింకు రోడ్లను విజయవంతంగా పూర్తి అయిందని, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరిన్ని లింకు రోడ్లపై దృష్టి సారించినట్లు అర్వింద్కుమార్ వెల్లడించారు. ఔటర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మిస్సింగ్ లింకు రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఔటర్ రింగు రోడ్డు వరకు అనుసంధానం ఉండేలా రోడ్లను నిర్మిస్తుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 160 ప్రాంతాల్లో పలు మార్గాలను గుర్తించడం జరిగిందని, ఎక్కువ శాతం శివారు ప్రాంతాల్లోని దమ్మాయిగూడ, నాగారం, పీర్జాదిగూడలు ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేస్తామని అర్వింద్కుమార్ వెల్లడించారు. ఈ 160 ప్రాంతాల్లో మార్గాల్లో చాలా వరకు క్రెడాయ్ సభ్యులు సూచించినవే ఉన్నాయని వివరించారు.