హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తేతెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వరి ధాన్య సేకరణపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో రైతులు యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగుచేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. శనగ, మక్కజొన్న, జొన్న, తెల్ల కుసుమ, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగుచేయడం లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ పంటలను డిసెంబర్లో విత్తుకొంటే దిగుబడి పెరిగి అధిక లాభాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు, అదికారులు తెలిపారు.
డిసెంబర్లో చేపట్టాల్సినవ్యవసాయ పనులు:
వానకాలంలో పత్తి పంట, ఆలస్యంగా నాటిన వరి.. కోత దశలో ఉన్నాయి. అకాల వర్షాల కారణంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున .. వాతావరణ పరిస్థితిలను గమనించి పంటను కోసి సిఫార్సు చేసిన తేమ శాతము ఉండేటట్ల్లు చూస్కొని .. కొనుగోలు కేంద్రలకు తీసుకొని వెళ్లాలి.
ప్రస్తుతం కంది పంటపై శనగ మచ్చ పురుగు, మారక మచ్చల పురుగు, ఇతర తెగుళ్లు వచ్చే అవకాశం ఉంది. వాటి నివారణకు సంబంధిత మండల వ్యవసాయ అధికారులను కలిసి నివారణ చర్యలు చేపట్టాలి.
శనగ పంటను ఆశించు శనగపచ్చ పురుగు, వేరుకుళ్లు, ఎండు తెగులు నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను సమీప వ్యవసాయ అధికారులను అడిగి తీసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం:
యాసంగి పంటకు 30 కిలోల నత్రజని(40 కిలోల యూరియా) 36 కిలోల భాస్వరం(75 కిలోల డీఏపీ), 12 కిలోల పొటాష్ (24 కిలోల మ్యురాట్ ఆఫ్ పొటాష్). నత్రజని, మ్యురాట్ ఆఫ్ పొటాష్ రెండు సమభాగాలుగా పంట విత్తినప్పుడు, మొగ్గ తొడుగు దశలో వేసుకోవాలి.
కలుపు నివారణ :
ఆక్సైఆర్జీల్ అనే కలుపు మందు 125 గ్రాములు ఒక ఎకరాకు విత్తిన 24-48 గంటల్లో 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత గుంటుక లేదా దంతెతో దున్నాలి.
నవంబర్లో వేసిన పొద్దుతిరుగుడు పంటను రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. వాటి నివారణకు వ్యవసాయ అధికారులను కలిసి తగు చర్యలను చేపట్టాలి.
నవంబర్లో విత్తుకున్న పొద్దు తిరుగుడుకు రెండో దఫా యూరియా (25 కిలోలు) ఎకరాకు, మ్యురాట్ ఆఫ్ పొటాష్ (15 కిలోలు) పై పాటుగా మొక మొదళ్లలో వేయాలి.
యాసంగిలో పొద్దు తిరుగుడుకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
వేరుశనగ :
పూత దశ, ఊడలు దిగే సమయంలో జిప్సంను పంట మొదళ్లలో వేసి మట్టిని ఎగదోయాలి. తర్వాత ఎలాంటి అంతర సేద్యం చేయరాదు.
యాసంగి వేరుశనగలో ఆకు ముడుత పురుగు, పొగాకు లద్దెపురుగు, ఆకు మచ్చ, కాండం, వేరు కుళ్లు రోగాలు వచ్చే అవకాశము ఉన్నది. వీటి నివారణకు వ్యవసాయ అధికారులు సూచించే చర్యలను చేపట్టాలి.
పొద్దు తిరుగుడు
యాసంగీగిలో వరికి బదులుగా పొద్దు తిరుగుడు పంటను ఈ డిసెంబర్ మాసంలో కూడా విత్తుకోవచ్చు.
అంతర పంటలుగా వేరుశనగను 4:2 నిష్ఫత్తిలో పండించవచ్చు.
వైరస్ తెగులు నివారణకు తైయోమితాక్యామ్ 3 గ్రా., లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీగ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.