హైదరాబాద్/ కరీంనగర్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు వేగంగా పూర్తవుతున్నాయి. మంగళవారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు, వివాదాలకు తావులేకుండా, సజావుగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కోరారు. పోలింగ్ ముగిసిన తర్వాత వీవీప్యాట్లను స్ట్రాంగ్రూంకు తరలించే సమయంలో తారుమారు చేసినట్టు వస్తున్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్, హుజూరాబాద్ ఆర్డీవోను శశాంక్గోయల్ వివరణ కోరారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై ఆదివారం అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా చేపట్టాలని, పోటీచేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల సీల్ తొలగించి ఓట్లు లెక్కించాలని ఆదేశించారు. సోమవారం అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (వచ్చే ఏడాది-2022) కింద మార్పులు, చేర్పులు, తుది ఓటరు జాబితా ప్రచురణపై చర్చిస్తామని తెలిపారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది.
14 టేబుల్స్.. 22 రౌండ్లలో లెక్కింపు
పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపర్చారు. ఇక్కడ స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించి మూడంచెల భద్రతను కల్పించారు. రెండో తేదీన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్టు ఆదివారం కరీంనగర్లో రిటర్నింగ్ అధికారి, హుజూరాబాద్ ఆర్డీవో సీహెచ్ రవీందర్రెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటుచేశామని, 22 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈవీఎం లు మార్చారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రవీందర్రెడ్డి ఖండించారు. మాక్ పోలింగ్లో మొరాయించిన వీవీ ప్యాట్ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి మార్చామని తెలిపారు. వీవీ ప్యాట్లో ఓట్లు ఉండవని, ఈవీఎంలలోనే ఓట్లు నిక్షిప్తమై ఉంటాయని వివరించారు.
ఓటేయలేదని డబ్బు వాపస్ తీసుకొన్న బీజేపీ నేతలు!
హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీకి ఓటు వేయలేదని వారికి ఇచ్చిన డబ్బులు బీజేపీ నేతలు తిరిగి వసూలు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కమలాపూర్లో ఓటుకు రూ.1,500 చొప్పున బీజేపీ నేతలు పంచారని సమాచారం. బీజేపీకి ఓటు వేయలేదని అనుమానం ఉన్న ఇండ్ల వద్దకు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆదివారం వెళ్లి.. ‘ఈటల రాజేందర్ డబ్బులు వసూలు చేసుకురమ్మన్నారు’ అంటూ ఓటర్ల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది. బీజేపీ నేతల తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఓటు కోసం డబ్బు లు ఎవడు ఇవ్వమన్నడు? మేమైనా బీజేపోళ్ల ఇంటికి వెళ్లి అడిగినమా? డబ్బులు ఇచ్చు డు ఎందుకు? మళ్లీ వసూలు చేసుడు ఎందుకు?’ అని ఓటర్లు నిలదీయటం వీడియోలో ఉన్నది. వీడియో వైరల్ కావడంతో వసూలైన డబ్బులు తిరిగి ఇచ్చినట్టు తెలిసింది.
31 గ్రామాల్లో 90 శాతం పోలింగ్
గ్రామాల్లో ఓటర్లు పోటెత్తారు. నియోజకవర్గంలోని 31 గ్రామాల్లో 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలోని 102 బూత్లో 93.93 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మికుంట మండలం కోరపల్లిలోని 160 బూత్లో 93.91, కమలాపూర్ మండలం గూనిపర్తిలో 93.41 శాతం ఓటర్లు ఓటేశారు. ఇల్లందకుంట మండలం మల్యాలలోని 234 బూత్లో 93.57 శాతం, 235లో 93.42 శాతం, 236లో 93.04 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం.