తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి యూనివర్సల్ కథలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన సినిమాలను ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలు రీమేక్ చేస్తున్నాయి. అలాంటి అవకాశం వాళ్ళకు ఇవ్వకుండా మన హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత మన సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో డిమాండ్ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకుంటూ మిగిలిన హీరోలు కూడా పాన్ ఇండియా కథల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అందరికంటే ముందు ఉంటే.. ఆయన తర్వాత మెగా హీరోలు ఉన్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో మూడు పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి.
తాజాగా పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కూడా అన్ని భాషలలో విడుదల కానుంది. 17వ శతాబ్దం కథతో దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు సీనియర్ నిర్మాత ఏఎమ్ రత్నం. శివరాత్రి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో వజ్రాల దొంగగా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అద్భుతమైన సెట్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. మరోవైపు పాతికేళ్ల కెరీర్ లో తొలిసారి చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. 2022 సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది.
మరోవైపు పుష్ప సినిమాతో ఇండియన్ వైడ్ గా బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఆగస్టు 13న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సౌత్ ఇండియా లో అల్లు అర్జున్ కు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు పుష్ప సినిమాతో హిందీలో కూడా మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు బన్నీ. వీళ్ళ కంటే ముందే బాలీవుడ్ లో ఒక అడుగు వేశాడు రామ్ చరణ్. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. హిందీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి బ్రాండ్ తో దాదాపు 150 కోట్ల బిజినెస్ చేస్తుంది త్రిపుల్ ఆర్. ఇలా ఈ మూడు మెగా పాన్ ఇండియన్ సినిమాల బిజినెస్ దాదాపు 1000 కోట్ల వరకు జరుగుతుంది. మరి ఈ దండయాత్రలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.