టోక్యో: విశ్వక్రీడా సమరానికి వేళైంది. పదహారు రోజుల వ్యవధిలో ప్రపంచ క్రీడాభిమానులను మరోమారు ఒక్కచోటికి చేర్చే సందర్భం రానే వచ్చింది. టోక్యో నగరం వేదికగా 16వ పారాలింపిక్స్ గేమ్స్కు మంగళవారం తెరలేచింది. ఒలింపిక్ స్టేడియం వేదికగా ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఒలింపిక్స్ లాగే పారాలింపిక్స్ కూడా ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే జరుగనున్నాయి. 13 రోజుల పాటు జరిగే ఈ విశ్వక్రీడా సంబురంలో 4403 మంది అథ్లెట్లు పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. ‘వీ హావ్ వింగ్స్’ అనే థీమ్ ప్రధానాంశంగా ఆరంభ వేడుకలు జరిగాయి. వైకల్యం తమ శరీరానికే కాని ఆత్మైస్థెర్యానికి కాదని నిరూపించేందుకు వివిధ దేశాల దివ్యాంగులు ఆకాశమే హద్దుగా తమ ప్రతిభను చాటిచేప్పేందుకు బరిలోకి దిగుతున్నారు. ఒక విమానం తరహాలో ప్రతి మనిషికి రెక్కలు ఉంటాయని, ఎక్కడికైనా విహరించవచ్చన్న ప్రధాన ఉద్దేశంతో పోటీలకు తెరలేచాయి. జపాన్ చక్రవర్తి నరుహిటో పోటీలు ప్రారంభమయ్యాయని ప్రకటించగానే టోక్యో స్టేడియం పటాకుల వెలుగు,జిలుగుల మధ్య తళుకులీనింది. తొలుత శరణార్థుల జట్టు స్టేడియంలో అడుగుపెట్టింది.