హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలకు ఏ కష్టం వచ్చినా మహిళా కమిషన్ అండగా నిలుస్తున్నది. గృహహింస, పని ప్రదేశంలో వేధింపులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఇలా ఎవరు సహాయం కోసం కమిషన్ గడప తొక్కినా కొండంత ధైర్యాన్నిచ్చి ఆదుకొంటున్నది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను నిలువరించేందుకు రాష్ట్రప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలను సక్రమంగా అమలయ్యేలా తనవంతు పాత్ర పోషిస్తున్నది. ఎన్ఆర్ఐలు సైతం కమిషన్ను ఆశ్రయిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ను ఏర్పాటు చేసింది. చైర్పర్సన్గా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులుగా షహీన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతిరావును నియమించింది. కమిషన్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం కమిషన్ కార్యాలయం (బుద్ధ భవన్)లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. మహిళా కమిషన్ తొలి వార్షికోత్సవాన్ని బుధవారం బుద్ధ భవన్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు. మహిళా సాధికారతపై రూపొందించిన పాటను ఈ సందర్భంగా ఆవిష్కరించి కమిషన్ వార్షిక నివేదికను విడుదల చేయనున్నారు.ఈ ఏడాది కాలంలో కమిషన్ను 466 మంది బాధితులు ఆశ్రయించారు. ఇందులో 255 కేసులను కమిషన్ పూర్తిగా పరిష్కరించింది. 211 కేసులు పరిష్కార దశలో ఉన్నాయి. వివిధ దేశాల్లోని 15 మంది ఎన్ఆర్ఐలు తమకు న్యాయం చేయాలని కమిషన్ను ఆశ్రయించగా పదిమంది సమస్యలు పరిష్కారమయ్యాయి. మహిళా కమిషన్ పరిష్కరించిన కేసుల్లో కొన్ని..
ఆమె ఓ ప్రైవేటు స్కూల్ టీచర్. వయస్సు 40 సంవత్సరాలు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలని ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించారు. భర్త, అత్త ఇద్దరూ తనను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ పిల్లల పట్ల కఠినంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ భర్తను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించింది. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉన్నది.
ఒక మహిళా ఉద్యోగి.. పై అధికారి మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, న్యాయంచేయాలని మహిళా కమిషన్ను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ వేధింపులకు గురిచేస్తున్న అధికారికి, ఆయన హెచ్వోడీకి నోటీసులు జారీచేసింది. సదరు హెచ్వోడీ సంబంధితశాఖలో అంతర్గత విచారణ చేపట్టి వేధింపులకు గురిచేస్తున్న అధికారిని వేరే జిల్లాకు బదిలీ చేశారు.
ఆ వృద్ధురాలికి 80 ఏండ్లు. తన కోడలు మెయింటెనెన్స్ ఇవ్వకపోవటంతో న్యాయం చేయాలని మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ఈ కేసును తక్షణమే పరిష్కరించాలని మహిళా కమిషన్ సంబంధిత జిల్లా కలెక్టర్కు లేఖ రాసింది. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి ఆ వృద్ధురాలికి నెలకు రూ.3వేల మొయింటెనెన్స్ వచ్చేలా చర్యలు తీసుకొన్నారు.