‘లాలా భీమ్లా..అడవి పులి..గొడవ పడి..’ అంటూ పోరాటానికి సన్నద్ధమవుతున్నారు భీమ్లానాయక్. పవన్కల్యాణ్, రానా కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె చంద్ర దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సంక్రాంతిని పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది.
ఈ సినిమాలోని రెండో గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. భీమ్లానాయక్ పోరాటస్ఫూర్తిని తెలియజెబుతూ సాగిన ఈ గీతానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సాహిత్యాన్నందించారు. తమన్ స్వరకర్త. ‘పది పడగల పాముపైన పాదమెట్టిన సామి తోడు..పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు..’ అనే చరణాలతో ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. అరుణ్ కౌండిన్య ఈ పాటను ఆలపించారు. ‘భీమ్లానాయక్ పోరాట సన్నివేశాల్లో ఈ గీతం వస్తుంది. త్రివిక్రమ్ తనదైన శైలి భావాలతో అద్భుతంగా ఈ పాటను రచించారు’ అని చిత్రబృందం తెలిపింది. నిత్యామీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీశర్మ, సముద్రఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, సంగీతం: తమన్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, సంభాషణలు, స్క్రీన్ప్లే: త్రివిక్రమ్, దర్శకత్వం: సాగర్ కె చంద్ర.