ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లలో దడసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్లపై ఉచ్చు బిగుస్తున్నది. ఉన్నతాధికారులు చేపట్టిన అంతర్గత విచారణలో అక్రమాలు తేలిన నేపథ్యంలో ఒక్కొక్కరిపై సస్పెన్షన్ వేటు పడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 15 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చాలాచోట్ల ఈ తరహాలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఫిర్యాదులు వెళ్లడంతో ఉన్నతాధికారులు సూత్రధారులెవరో నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. రెండు నెలల క్రితం భువనగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఓ ఉద్యోగిపై వేటు పడగా, ఇటీవల
నల్లగొండ జిల్లాలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్కు గురయ్యారు. ఇంకా మరికొందరిపైనా శాఖాపరమైన చర్యలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్రమార్కుల్లో దడ మొదలైంది.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత కోసం అనేక సంస్కరణలు చేపడుతున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరుగుతున్నాయి. భూమి ఏదైనా అమ్యామ్యాలు సమర్పిస్తే .. సక్రమమేనని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దాంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి ఛాయలు నేటికీ చెరిగి పోవడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు సబ్ రిజిస్ట్రార్లపై అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
నిబంధనల ప్రకారం..ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ లేని ప్లాట్లతోపాటు అనుమతి లేని ప్లాట్లు, లే-అవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయకూడదని 2020 డిసెంబరులో ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారు. కొన్ని చోట్ల రిజిస్ట్రార్లు సెలవు పెట్టిన రోజు కిందిస్థాయి సిబ్బంది అక్రమ రిజిస్ట్రేషన్లకు తెర తీశారు. ఇరవై, ముప్పై ఏండ్ల క్రితం అప్పటి సర్పంచులు లే-అవుట్లకు అనుమతి ఇచ్చినట్లు బినామీ పత్రాలు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిసింది. నిషేధిత భూములకు సైతం రిజిస్ట్రే
షన్లు చేసినట్లు సమాచారం.
సస్పెన్షన్లతో అధికారుల్లో దడ..
అక్రమ రిజిస్ట్రేషన్లపై తీవ్రస్థాయి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారులు కొంతకాలంగా అంతర్గతంగా శాఖాపర విచారణ నిర్వహిస్తున్నారు. భువనగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే రోజు వంద, రెండు వందల రిజిస్ట్రేషన్లు జరుగడం..అదీ రాత్రివేళల్లో కొనసాగడంతో సంబంధిత ఉద్యోగిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు వెలుగు చూడడంతో దీనిపై సీరియస్గా దృష్టి పెట్టిన అధికారులు పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండయ్యారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లాల్లో మరికొందరు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రస్తుతం జరుగుతున్న వరుస పరిణామాలు ఆ శాఖ ఉద్యోగులను కలవర పెడుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్లపై ఏ మేరకు చర్యలు ఉంటాయన్నది? ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ మార్గదర్శకాలకు తిలోదకాలు..
ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే చాలు..ఇక ఏం కాదు! అనే భావన స్థిరాస్తి వ్యాపారుల్లో ఉంది. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా..అపరాధ రుసుము విధించడం లేదా ఆ స్థలాలను క్రమబద్ధీకరణ(రెగ్యులరైజ్) చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు రిజిస్ట్రేషన్ కీలకమవుతుండడంతో బినామీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసే దందాకు అక్కడక్కడా తెరలేస్తున్నది. మరో పక్క ప్రభుత్వ మార్గదర్శకాలను సైతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదు. ప్రైవేటు వ్యక్తులను లోపలికి రావొద్దని, దస్ర్తాలను పక్కాగా పరిశీలించాలని, ప్రతి ఒక్కరూ కార్యాలయ పనివేళలు పాటించాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని పదేపదే ఉన్నతాధికారులు సూచిస్తున్నా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నేటికి కొన్నిచోట్ల అడ్డగోలుగా జరుగుతూనే ఉన్నాయి.