న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఇంద్రుడి వజ్రాయుధం.. శివుడి త్రిశూలం.. భారత సైనికుల చేతిలో ఆయుధాలు కానున్నాయి. సరిహద్దుల్లో భస్మాసురుల్లా వ్యవహరిస్తున్న చైనా సైనికులకు కరెంటు ప్రవహించే చేతి తొడుగు షాక్ ఇవ్వనున్నది. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం చైనాకు బుద్ధి చెప్పడానికి వినూత్న ఆయుధాలను తయారు చేయిస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటి ఘర్షణలు ఏర్పడితే ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధమైంది. యూపీలోని నోయిడాకు చెందిన అపాస్టెరాన్ అనే స్టార్టప్ ఈ ఆయుధాలను రూపొందించింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యం పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒకరికొకరు ఎదురుపడితే తుపాకులు వాడరాదని ఒప్పందం ఉన్నది. తుపాకులు వాడొద్దన్నారని చెప్పి చైనా ఇనుపరాడ్లతో భారత సైన్యంపై గల్వాన్లో దాడికి దిగింది. ఈ నేపథ్యంలోనే.. భారత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆయుధాలు తయారు చేయాలని సైన్యం తమను కోరినట్టు అపాస్టెరాన్ తెలిపింది.