హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురస్తాయని చెప్పింది. గురువారం చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని తెలిపింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని, ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది.