హైదరాబాద్ : తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉందని.. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాలతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.