హైదరాబాద్ : డాక్టర్లను దేవుళ్లతో పోల్చడం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ ప్రయివేటు డాక్టర్ మాత్రం నిరుపేదల పాలిటి నిజంగా దేవతే. కేవలం రూ. 10 ఫీజు తీసుకుని పేదరికంలో ఉన్న నిరుపేదలకు వైద్యం అందిస్తున్నారు. ఇది ఎక్కడో కాదు.. హైదరాబాద్లోని నేరెడ్మెట్ ప్రాంతంలో.
అయితే ఆ ఏరియాలో ఉండే గోపాల్ అనే వ్యక్తి గత కొన్నేండ్ల మెడికల్ ఫీల్డ్లో పని చేస్తున్నాడు. నిరుపేదలకు తన వంతు సాయం చేయాలని గోపాల్ అనుకున్నాడు. ఇదే విషయాన్ని రోసిలినే అనే మహిళా వైద్యురాలిని సంప్రదించాడు. గోపాల్ విజ్ఞప్తికి డాక్టర్ ఓకే చెప్పేశారు. దీంతో నేరెడ్మెట్లోని అంబేద్కర్ భవన్లో నిరుపేదలకు తక్కువ ఫీజుతో వైద్యం చేయడం ప్రారంభించారు. కేవలం రూ. 10 ఫీజు తీసుకుని రోజుకు 15 మంది చికిత్స అందిస్తున్నారు. ల్యాబ్ టెస్టులపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు.
చాలా మంది నిరుపేదలు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. డాక్టర్ ఫీజు రూ. 300, రూ. 200 కూడా చెల్లించలేని నిరుపేదలున్నారు. వీరందరిని దృష్టిలో ఉంచుకుని రూ. 10 కే క్లినిక్ను ప్రారంభించామని గోపాల్ తెలిపారు. డాక్టర్ రోసిలినే సహకారంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇక గైనకాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ వంటి సేవలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.