దామోహ్ : ఎమ్మెల్యే భర్త ఆచూకీ చెబితే రూ. 30 వేలు నగదు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. దామోహ్ జిల్లాలోని పతారియా బీఎస్పీ ఎమ్మెల్యే రాం భాయ్ సింగ్. ఈమె భర్త గోవింద్ సింగ్. 2019లో జరిగిన కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియా హత్య కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. కేసు విచారణ సందర్భంగా గోవింద్ సింగ్ను అరెస్టు చేయాల్సిందిగా మృతుడి కొడుకు సోమేశ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాడు. కేసు విచారణలో పోలీసుల నిష్క్రియాపరత్వంపై సీరియస్ అయిన సుప్రీం తక్షణమే గోవింద్ సింగ్ అరెస్టుకు ఆదేశించింది. అదేవిధంగా కేసు విచారణ నిర్వహిస్తున్న అదనపు సెషన్స్ జడ్జిపై వచ్చిన ఆరోపణలపై సైతం దర్యాప్తు చేయాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. దీంతో పరారీలో ఉన్న గోవింద్ సింగ్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసుశాఖ నగదు రివార్డును ప్రకటించింది. ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది.