Nagarkurnool | నాగర్కర్నూల్: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఓ యువకుడిపై ఎస్సై పోలీస్ స్టేషన్లోనే దారుణంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి ఎస్సై, ఓ కానిస్టేబుల్ కలిసి విచక్షణారహితంగా కొట్టారని తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్ ఆరోపించారు. తనపై ఎలాంటి కేసు లేకపోయినా.. విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు.
బాధితుడు మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతికి సంబంధించిన వ్యవహారంపై విచారణ కోసం మంగళవారం తనను తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టేషన్లో కూర్చోబెట్టారని, అనంతరం ఏం అడగకుండానే ఎస్సై, కానిస్టేబుల్ కలిసి కొట్టారని ఆరోపించారు. పడుకోబెట్టి రబ్బర్ బెల్ట్తో విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకోలేదని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. బూతులు తిడుతూ దుర్భాషలాడారని ఆరోపించారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా స్టేషన్కు వచ్చానని, ఆకలిగా ఉందని చెప్పినా పట్టించుకోలేదన్నారు. దూపకైతుందని నీళ్లు అడిగితే.. ఎస్సై తన ముఖంపై మూత్రం పోశాడని తీవ్ర ఆరోపణ చేశారు.
తనను బెదిరిస్తూ ఎస్సై తీవ్ర వ్యాఖ్యలు చేశారని మహేందర్ ఆరోపించారు. ‘‘నీకు సోషల్ మీడియా ఇన్చార్జి ఎవడిచ్చాడు? నా గురించి తెలుసా? ఇప్పటివరకు రెండు ఎన్కౌంటర్లు చేశాను.. నీది మూడోది అవుతుంది. నీ ఆర్సీ తాండాలోనే వేసేస్తా’’ అంటూ బెదిరించాడని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే తనపై కేసు నమోదు చేయాలని.. కానీ ఎలాంటి తప్పు చేయకుండానే స్టేషన్కు పిలిచి కొట్టడం ఏమిటని మహేందర్ ప్రశ్నించారు. జరిగిన అవమానంతో నాగర్కర్నూల్ డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు సందర్భంగా కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ ఆరోపణలపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఘటనపై వివరణ కోసం పోలీసు అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.