న్యూయార్క్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుతం న్యూయార్క్లో పర్యటిస్తున్నారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆయన ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఆ ర్యాలీకి తాను మద్దతు ఇవ్వడం లేదని న్యూయార్క్ సిటీ మేయర్(New York City Mayor) జోహ్రాన్ మామ్దానీ అన్నారు. కానీ ఆ ఈవెంట్ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. ఆగస్టు 29వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఆర్ఎస్ఎస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు భగవత్ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్లో జరిగే యూనివర్సల్ వన్నెస్ ప్రోగ్రామ్లో ఆయన పాల్గొంటారు. సుమారు 5వేల మంది ఆ కార్యక్రమానికి హాజరవుతారు.
ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న మామ్దానీ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ ఈవెంట్కు మద్దతు ఇవ్వడం లేదని, కానీ ఆ ఈవెంట్ను రద్దు చేసే న్యాయపరిధి తమకు లేదని ఆయన అన్నారు. ఎంఎస్జీ వద్ద జరిగే ర్యాలీని రద్దు చేయాలని నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై మామ్దానీ స్పందించారు. ఈ సిటీకి తాను తొలి భారత-అమెరికా సంతతి మేయర్ వ్యక్తిని అని, మా అమ్మ ఫ్యామిలీ ఇంకా భారత్లోనే ఉందని మామ్దానీ అన్నారు. భారత్ బహుళత్వ సమాజం అని, సెక్యులర్ దేశమని, ఇలాంటి అంశాలనే తన కుటుంబం తనకు నేర్పినట్లు ఆయన చెప్పారు. కానీ ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఓ ఉద్యమం సాగుతోందని, దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ తెలిపారు.
ఎంఎస్జీలో జరిగే ఈవెంట్ను వ్యతిరేకిస్తూ అనేక మత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు న్యూయార్క్ సిటీ హాల్లో మీడియా సమావేశాన్నినిర్వహించాయి. మోహన్ భగవత్ పాల్గొనే ఆర్ఎస్ఎస్ ఈవెంట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఇంటర్ఫెయిత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్ సంస్థలు కూడా ఈ మీట్కు హాజరయ్యాయి. యునివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ ఈవెంట్ను ఏహెడ్ ఫోరమ్ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలోనే భగవత్ పాల్గొననున్నారు. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అన్న సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తం చేయనున్నారు.