KCR | ఇస్లాం మత ప్రవక్త హజ్రత్ మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావం, శాంతి, సహనం, ప్రేమ, కరుణ వంటి మానవీయ విలువలను ప్రబోధించిన హజ్రత్ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు.
పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కృషి చేసిన పదేళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణలో గంగా–జమునా తహజీబ్కు ఆలవాలంగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టకుండా, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తిని ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే దేశంలో భిన్న మతాలు, ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాల మధ్య సామరస్యం పరిఢవిల్లుతుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.