న్యూఢిల్లీ: అగ్నిపథ్పై ఇవాళ రక్షణశాఖ మీడియాతో మాట్లాడింది. మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ అనిల్ పురి మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్తో సాయుధ దళాల్లో యువ ప్రొఫైల్ను తయారు చేయవచ్చు అన్నారు. సాంకేతికంగా సమర్థులను, ఆర్మీలో చేరేందుకు కావాల్సిన సామర్థ్యం ఉన్నవారిని రిక్రూట్ చేయనున్నట్లు చెప్పారు. ఆర్మీకి తగినట్లు అగ్నివీరుల్ని తీర్చిదిద్దడం వల్ల వాళ్లు భవిష్యత్తుకు సిద్దంగా ఉంటారని అనిల్ పురి తెలిపారు. రిక్రూట్మెంట్ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని, ఎటువంటి విధ్వంసంలో పాల్గొనలేని అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రం స్వీకరిస్తామన్నారు. భౌగోళికంగా ఇండియా ఉన్న రీతిలో మరో ఏ దేశం లేదన్నారు. దేశంలో 50 శాతం యువత 25 ఏళ్ల లోపు ఉన్నారని, ఆర్మీ దీన్ని వినియోగించుకోవాలన్నారు.
అగ్నివీరుల్ని వైమానిక దళంలోకి మెల్లగా ఇండక్ట్ చేసుకుంటామని ఎయిర్ మార్షల్ ఎస్కే జా తెలిపారు. తొలి ఏడాది కేవలం రెండు శాతం మాత్రమే ఇండక్షన్ ఉంటుందని తెలిపారు. అయిదవ సంవత్సరం నాటికి ఆ సంఖ్య ఆరు వేలకు చేరుతుందని ఆయన అన్నారు. పదవ సంవత్సరం నాటికి ఆ సంఖ్య పది వేలకు చేరుతుందని ఎయిర్ మార్షల్ జా వెల్లడించారు. అగ్నివీర్ వాయు ద్వారానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఎన్రోల్మెంట్ జరుగుతుందని ఆయన చెప్పారు. వైమానిక దళాన్ని సంసిద్ధంగా ఉంచేందుకు ఐఏఎఫ్తో పాటు భారత ప్రభుత్వం వీలైనంత చేస్తుందని జా అన్నారు. ఇండక్షన్ పద్ధతిలో ఎటువంటి మార్పు ఉండదని, ఎంట్రీ లెవల్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ సిలబస్, మెడికల్ స్టాండర్డ్స్ అన్ని అలాగే ఉంటాయని సూరజ్కుమార్ జా తెలిపారు.
రిక్రూట్మెంట్ క్యాలెండర్ రేపటి నుంచి ప్రారంభంకానున్నట్లు ఇండియన్ నేవీ సీవోపీ వైస్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్నదని ఆయన చెప్పారు. అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత నేరుగా మర్చెంట్ నేవీలోకి వెళ్ల వచ్చు అని త్రిపాఠి వెల్లడించారు.