మా గ్రామంలో పీవీ దగ్గరి బంధువులు ఉండటం వల్ల తాను చిన్నప్పుడు, ఎండకాలం సెలవుల్లో వచ్చేవారని, వారితో మా నాయన, నలుగురు చిన్నాన్నలు ఆడుకునేవాళ్లని నాయన తరచూ నాతో గుర్తుచేసుకునేవాడు. మా రెండో చిన్నాయన వై.నారాయణ తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకుడిగా నిజాం ప్రభుత్వానికి సింహస్వప్నం. ఒక దశలో ఆయనపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. అయినప్పటికీ ఆయన మారువేషంలో సంచరిస్తూ ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్లాడు. పోలీసుల గాలింపులు ఎక్కువైన పరిస్థితుల్లో నాగపూర్ వెళ్లి బార్డర్ క్యాంపులు నిర్వహించాడు. అక్కడ ఆయనకు పీవీతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. హైదరాబాద్ విలీనం తర్వాత ఇద్దరూ రాజకీయాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఇరువురూ కాంగ్రెస్ పార్టీలోనే చివరి శ్వాస వరకు సేవలందించారు.
పీవీని నేను ప్రత్యక్షంగా 1970 దశకంలో మొదటిసారి పరకాల పట్టణంలో ఒక మీటింగ్లో చూశాను. అది కాంగ్రెస్ కార్యకర్తల ఎన్నికల సమావేశం, ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నది మా పెద్దన్నయ్య ఎర్రా విశ్వంభర్రావు కావడం వల్ల పీవీని చూడాలనే ఉత్సాహంతో వెళ్లి ముందువరుసలో కూర్చున్నాను. ఒకతను వచ్చి.. ‘ఏ పిల్లగా ఇక్కడ నీకేం పని’ అని బిగ్గరగా అరిచినప్పటికీ, తర్వాత సమావేశంలో అలజడి అవుతుందనే ఉద్దేశంతో ఊరుకున్నాడు. దాదాపు 2 గంటలకు పైగా పది, పదిహేను మంది ఉపన్యాసాలిచ్చారు. సమావేశం చివరి వరకు పీవీ స్టేజీ ముందుభాగంలో కిందే కూర్చున్నారు. ఆ మొత్తం రెండు గంటలు పీవీ నిద్రపోతూ ఉన్నట్లుగా కనిపించారు. అసలు పీవీ పడుకున్నారా లేదా అన్నీ వింటూ విశ్రాంతిగా ఉన్నారా అర్థం కాలేదు. చివరగా పీవీ మాట్లాడాల్సిన సమయంలో లేచి అంతకుముందు మాట్లాడిన మాటలు, స్థానిక సమస్యలేవీ ప్రస్తావించకుండానే అరగంట సేపు అనర్గళంగా మాట్లాడారు. దేశ కాల పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ ఆద్యంతం ప్రవాహంలాగా మాట్లాడారు. ఈ పెద్ద మనిషి స్థానిక సమస్యలు ప్రస్తావించకుండా ఓట్లు అడుగుతున్నాడేమిటి అనుకున్నాను. అయితే సమావేశానంతరం కొంతమంది పెద్దల మాటల్లో ‘ఆయన అంతర్జాతీయవాది ఆయనకు స్థానిక సమస్యలు పట్టవు, ఆయన రూటే వేరు’ అని వ్యాఖ్యానించుకోవడం విన్నాను. 1982లో అనుకుంటాను, ఒకసారి పీవీ కేంద్రమంత్రిగా పరకాల పట్టణంలో ఒక ప్రారంభోత్సవానికి వచ్చారు. అప్పుడు కూడా ఆయనను చూడగలిగాను.
ఒక నాయకుడు గ్రూపు రాజకీయం, సొంత వర్గం, డబ్బు లేకుండా సమకాలీన రాజకీయాల్లో మనగలగటం ఆశ్చర్యం. పీవీ ప్రధానిగా ఎదిగాడంటే కేవలం ఆయన ప్రతిభనే కారణం. కాంగ్రెస్కు నిబద్ధత కలిగిన సైనికుడిగా సలహాలిచ్చే మేధావిగా, రాజకీయ దురంధరుడుగా, అపర చాణుక్యుడిగా, గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. కాంగ్రెస్లో, దేశంలో మొదటిసారిగా అందరికీ ఆమోదయోగ్యుడిగా గాంధీయేతర కుటుంబం నుంచి ప్రధానిగా పూర్తికాలం కొనసాగి అనేక సంస్కరణలకు ఆద్యుడయ్యారు.
ప్రధానిగా పీవీ తన పదవీకాలంలో తీసుకున్న ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నిర్ణయాల వల్లనే మన దేశం ప్రపంచపటంలో ఒక పెద్ద ఆర్థికశక్తిగా నిలిచింది. దేశంలో ప్రపంచీకరణ ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశానికి దశ, దిశా నిర్దేశం చేసిన ఆర్థిక కోవిదుడు. ఒకే ఆలోచన విధానం కలిగిన ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా తోడు చేసుకుని ఇద్దరు కలిసి దేశ ఆర్థికవ్యవస్థ సుస్థిరతకు కృషిచేశారు.
ఉత్తరాది వారి ఆధిక్యత దేశంలోని అన్నిరంగాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 1980లో నేను ఢిల్లీ వెళ్లినపుడు నన్ను ఏ ప్రాంతం వారని అడక్కుండానే ఇడ్లి, సాంబార్ వాలా, మదరాసివాలా అని వెక్కిరింతతో మాట్లాడటం చూశాను. దక్షిణాది వారంటే మదరాసు వారు కాకుండా తెలుగు ప్రాంతం కూడా ఒకటి ఉందనే సోయి వారికి ఉండేది కాదు. అందులో తెలంగాణ అస్తిత్వం సున్నాగా ఉండేది. నేను సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేసేటప్పుడు అనేక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ‘మన తెలంగాణ, అందులో మన కరీంనగర్ జిల్లా నుంచి భారత ప్రధాని ఎవర’ని అడిగేవాణ్ణి. బ్లాక్బోర్డ్పై పీవీ పేరు రాసేలా, ఉదయం ప్రార్థనా సమయంలో పీవీ పేరు చెప్పేలా విద్యార్థులను ప్రోత్సహించాను.
2002లో నేను హన్మకొండ ఎమ్మార్వోగా ఉన్నపుడు పీవీ మాజీ ప్రధానిగా వారి సొంత ఊరు వంగరకు వెళ్లడానికి ఖాజీపేట రైల్వేస్టేషన్లో దిగారు. ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా కడిపికొండకు దగ్గరలోనే రైలు ఆపి కారు రైల్వే పట్టాల సమీపంలో ఉండేట్లుగా ఏర్పాట్లుచేశాం. రైలు దిగిన తర్వాత చాలా మెల్లగా ఆయనను నడిపించుకుంటూ ఆయనతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం నాకు కలిగింది. ఇంతలో ఒక విద్యార్థి ఆయన్ను చూసి ఎదురుగా వచ్చి పాదాభివందనం చేశాడు. ఊహించని పరిణామంతో అతన్ని మేం లేపి పక్కకుతోస్తూ ఉంటే పీవీ వారించారు. అప్పుడు ఆ పిల్లవాడు- ‘సార్ నేను రాంటెక్లో బీటెక్ విద్యార్థిని. మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాన’న్నాడు. అప్పుడు పీవీ అతని తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు.
(వ్యాసకర్త: రిటైర్డ్ జాయింట్ కలెక్టర్)
2004లో నేను సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేస్తున్నపుడు జరిగిన ఒక బాధాకరమైన విషయం నన్నిప్పటికీ బాధిస్తుంది. అది- డివిజన్లోని అన్ని ప్రభుత్వ శాఖల విస్తృత సమావేశం ఏర్పాటుచేసి (ఇద్దరు ఎమ్యెల్యేలు స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు, కాసిపేట లింగయ్య ఆసీనులై ఉన్నారు) మైకులో నేను మాట్లాడుతుంటే ఆహూతుల నుంచి ఒక విలేకరి నాకో చిన్న కాగితం పంపించాడు. దానిలో ఇప్పుడే అందిన వార్త పీవీ నరసింహారావు ‘స్వామి శరణం’ అని రాసి ఉన్నది. అది చూడగానే ఆ విషయాన్ని నేను వెంటనే సమావేశంలో అందరికీ తెలియజేశాను. ఆ సమావేశాన్ని సంతాపసభగా మార్చాను. రెండు నిమిషాల పాటు మౌనం పాటించాం. చివరలో మళ్లీ కొంతమంది విలేకరులు స్టేజిపైకి వచ్చి సార్సార్ పొరపాటు జరిగింది. పీవీ ఇంకా జీవించే ఉన్నారు. అది తప్పుడు వార్త అని చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో ఉన్న మీడియా మిత్రులతో చర్చించి విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాం. అయినప్పటికీ నాకెందుకో తప్పు చేసిన భావన నా మది నుంచి ఇప్పటికీ పోవడం లేదు. వినీలాకాశంలో సంచరిస్తున్న ధృవతార పీవీ ఆత్మ మనసారా క్షమించాలని కోరుకుంటున్నాను.