ఇంట్లోనే ఉందంటూ చైనా ఫొటోలు విడుదల
న్యూయార్క్: రెండు గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిళ్ల విజేత చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి అదృశ్యంపై క్రీడా దిగ్గజాలు, మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమె కనిపించకుండా పోవడంపై సోషల్ మీడియా వేదికగా ఉద్యమం తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్ హు జియాన్ స్పందిస్తూ షువాయికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశాడు. ‘ఇంట్లోనే ఆమె కుటుంబ సభ్యులతో ఉంది. నాకున్న వనరుల ద్వారా ఆమె ఎక్కడుందో తెలుసుకున్నా. ఆమె స్వేచ్ఛగా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంది. షువాయి త్వరలోనే జనంలోకి వస్తుంది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది కూడా’ అని తెలిపాడు. ఇదిలా ఉంటే ఆమెను ప్రత్యక్షంగా సమాజానికి చూపించాలనే డిమాండ్ వస్తున్నది. షువాయి అదృశ్యంపై టెన్నిస్ దిగ్గజాలు ఒసాకా, సెరెనా, జొకోవిచ్ ఆందోళన వ్యక్తం చేశారు.