రైతులు ఇతర పంటలపై దృష్టి పెట్టారు. ఉల్లి.. మిర్చి.. టమాట.. పాలకూర తదితర నారును విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, కల్హేర్ తదితర ప్రాంతాల నుంచి అంగళ్లకు వివిధ రకాల నారును తెచ్చి అమ్ముతున్నారు. అంగళ్లలో తాము సుమారు రూ.30వేల వరకు అమ్మకాలను జరుపుతామని, ఖర్చులన్నీ పోనూ రూ.25వేల వరకు సంపాదిస్తామని సూర్యాపేట, నల్లగొండ రైతులు తెలిపారు. తాము ఏడాదంతా ఇతర పంటల జోలికి వెళ్లమని కేవలం కూరగాయల పంటలను వేసుకుని విక్రయిస్తున్నామంటున్నారు.
రామాయంపేట, డిసెంబర్ 6 : నారు అమ్మకాలతో రైతన్నలు వ్యాపారులుగా మారుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అంగళ్లకు తరలించిన లాభాలు పొందుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, కల్హేర్ తదితర ప్రాంతాల నుంచి రామాయంపేటలో జరిగే బుధవారం సంతకు చేరుకుని వివిధ రకాల నారును అమ్మకాలను చేపడ్తున్నారు. ప్రతి వారం బుధవారం రామాయంపేట అంగడితో పాటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్ ప్రధాన కేంద్రాల్లో నాటును ఇతర జిల్లాల వాసులు అంగళ్లకు చేరుకుని అమ్మకాలను జరుపుతున్నారు.
సూర్యాపేట, నల్లగొండ, సంగారెడ్డి నుంచి రామాయంపేట మండల కేంద్రంలోకి రావాలంటే ఆ రైతులకు సుమారు వంద కిలో మీటర్లపైనే ఉంటుంది. అయినా ఖర్చులకు వెనుకాడకుండా తమ వద్ద ఉన్న ఉల్లినారు, పచ్చిమిర్చి, టమాట, పాలకూర తదితర నారును ఒక్కో రైతు నాలుగు బస్తాలపైనే రామాయంపేటలో అమ్మకాలు చేపడతారు. రామాయంపేటలోనైతే చుట్టుపక్కల మండలాలతో పాటు గ్రామాలు, బస్సులలో వెళ్లే రైతులు, ప్రయాణికులు కూడా తమవద్ద నారును తీసుకుని వెళ్తారని నారు అమ్మకాలు చేపట్టే రైతులు తెలిపారు. ఈ అంగళ్లలో తాము సుమారు రూ.30వేల వరకు అమ్మకాలను జరుపుతామని తెలిపారు. ఉల్లినారు అమ్మకాలతో తమ ఖర్చులన్నీ పోనూ తమకు రూ.25వేల వరకు డబ్బులను సంపాదిస్తామని సూర్యాపేట, నల్లగొండ రైతులు తెలిపారు. తాము ఏడాదంతా ఇతర పంటల జోలికి వెళ్లమని కేవలం కూరగాయల పంటలను వేసుకుని విక్రయాలను జరుపుతామన్నారు. తమకున్న వ్యవసాయంలో మొత్తం ఆరుతడి పంటలనే వేస్తామని తెలిపారు. తాము అంగళ్లకు వెళితే తమ ఇంటి వారే నాటును సిద్ధం చేసి కూరగాయల అమ్మకాలు చేపడ్తారని తెలిపారు. ఏడాదంతా తాము కష్టపడి అమ్మకాలు చేస్తే తాము ఎకరం పొలంలో రూ.5లక్షలకు పైగానే లాభాలను గడిస్తామన్నారు. సీఎం కేసీఆర్ సార్ చెప్పిన మాట ప్రకారం తాము అంతర పంటలు వేసుకోవడంతో పాటు ఉల్లి, టమాట, మిర్చి, పాలకూర, మెంతి, కొత్తిమీర, పూదీన తదితర సాగునే చేస్తూ లాభాలను గడిస్తున్నామని తెలిపారు..