తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు (Vasantotsavam) సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంతమండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి( Kalyana Venkateswara Swamy) వారి ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో అభిషేకం (Abhishekam) చేశారు.
సాయంత్రం ఊంజల్సేవ అనంతరం స్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుపనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్లు తెలిపారు.