‘తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాల విలువ ఎప్పటికీ తగ్గదు. వాణిజ్య ప్రధాన సినిమాల్ని తెరకెక్కించే అత్యుత్తమ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు’ అని అన్నారు హీరో రామ్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘గాలిసంపత్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్, లవ్లీసింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనీష్ దర్శకుడు. ఎస్. క్రిష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా రాజేంద్రప్రసాద్కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. రాజ్కుమార్ హిరాణీ శైలిలో చక్కటి అనుభూతిని కలిగిస్తోంది. ఏడిపిస్తూనే నవ్వించే చిత్రమిది. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అన్నారు. రాజేంద్రప్రసాద్ నుంచి చాలా నేర్చుకున్నానని శ్రీవిష్ణు పేర్కొన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘సరికొత్త ప్రయత్నమిది. గాలిసంపత్గా రాజేంద్రప్రసాద్ పాత్ర అందరిని నవ్విస్తుంది’ అని పేర్కొన్నారు. తన సినీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రమిదని, ప్రమాదం వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయిన వ్యక్తిగా తాను ఈ సినిమాలో కనిపిస్తానని రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘తండ్రీకొడుకుల అనుబంధంతో సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. శ్రీవిష్ణును నవ్యరీతిలో ఆవిష్కరిస్తుంది. రాజేంద్రప్రసాద్ పాత్ర ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది’ అని దర్శకుడు అనీష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అచ్చు, లవ్లీసింగ్, ఎస్.క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.