ప్రభాస్ నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ‘ఆదిపురుష్’. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఓం రావత్ దర్శకుడు. కృతి సనన్ నాయికగా నటిస్తున్నది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాఘవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్టులు ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ షాట్స్ సంఖ్య ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికీ వాడనంత ఉంటుందట. తాజాగా ఆదిపురుష్ సినిమా గురించి ఓ వార్త వినిపిస్తున్నది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరపైకి తీసుకొచ్చే యోచనలో చిత్రబృందం ఉందట. దర్శకుడు ఓం రావత్ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రభాస్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు ప్రభాస్. ‘ఆదిపురుష్’ కూడా అదే దారిని ఎంచుకుంటుందా చూడాలి. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ మరో కొత్త సినిమా ‘సలార్’ కూడా రెండు భాగాల చిత్రంగా వస్తుందనే వార్తలొచ్చాయి. ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ ఈ విషయంపై స్పందించేందుకు ఇష్టపడలేదు.