కొండపాక/హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పది రోజుల్లో 9 సార్లు పెట్రో ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం టోల్చార్జీలను కూడా విపరీతంగా పెంచింది. జాతీయ రహదారుల టోల్ప్లాజాలపై కేంద్రం పెంచిన టోల్ రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. అసలే కరోనాతో అంతంత మాత్రంగా ప్రజల ఆర్థిక పరిస్థితి ఉండగా, ధరల సవరణ పేరుతో చేస్తున్న ఈ పెంపు వల్ల సామాన్యుడిపై భారం మరింత పెరగనున్నది. కార్లకు సుమారు రూ.10 వరకు, కమర్షియల్ లైట్ మోటర్ వెహికల్స్కు రూ.15 – రూ.20 వరకు, బస్సులు, లారీలకు రూ.30 – రూ.50 వరకు పెరిగాయి. అతి భారీ వాహనాలకు రూ.50 – రూ.100 వరకు టోల్ చార్జి పెరిగింది. టోల్గేట్ల మధ్య, ఆయా ప్రాంతాల దూరాన్ని బట్టి కేంద్రం రేట్లు పెంచింది.
రాజీవ్ రహదారిపై ఉన్న టోల్గేట్లలో జూన్ నుంచి వాహనాల రాకపోకలపై రుసుమును పెంచనున్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న ఒకటో నంబరు రాష్ట్ర రహదారి (రాజీవ్ రహదారి)పై 3 టోల్ప్లాజాలు ఉన్నాయి. వీటి మీదుగా నిత్యం 15 వేల పైచిలుకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.