స్టాక్ మార్కెట్లు.. మ్యూచువల్ ఫండ్లు.. రెండూ వేర్వేరు మదుపు సాధనాలు. కానీ ఇవి ఒకటే అన్నట్టుగా చాలామంది అర్థం చేసుకుంటారు.
ఈ రెండింటిలో ఏది ఉత్తమ మదుపు మార్గం అనే సందేహాలు కూడా తరచూ వ్యక్తమవుతుంటాయి. అయితే వీటి మధ్య చాలా వ్యత్యాసాలున్నాయి.
రిస్క్, రాబడులలోనూ.. ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు, వాటి నిర్వహణల్లోనూ తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే వాటి ఎంపిక, మదుపు సులువవుతుంది.
షేర్లు కొనడం అంటే కంపెనీలో యాజమాన్య హక్కులను పొందడం. కంపెనీ ఆర్జించే లాభాల్లో వాటా (డివిడెండ్)తోపాటు వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనవచ్చు. షేర్లను నేరుగా స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేయడం వల్ల డివిడెండ్తోపాటు, షేరు ధర పెరగడం వల్ల కూడా రాబడి ఉంటుంది. మొదట మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.
పరోక్ష మదుపు
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడమంటే వివిధ రకాల ఆర్థిక సాధనాల్లో పరోక్షంగా మదుపు చేయడం. మరో రకంగా చెప్పాలంటే కారు సొంతంగా డ్రైవ్ చేయకుండా నిపుణుడైన డ్రైవర్ సాయంతో ప్రయాణించడం లాంటిది. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్లు, డెట్ ఫండ్లు, హైబ్రిడ్ ఫండ్లు ప్రధానమైనవి. వాటి నిర్మాణాన్నిబట్టి ఓపెన్ ఎండెడ్ ఫండ్లు, క్లోజ్ ఎండెడ్ ఫండ్లు అనే రెండు రకాలున్నాయి. ఓపెన్ ఎండెడ్ ఫండ్లలో ఎప్పుడైనా అమ్మడం, కొనడం చేయవచ్చు. క్లోజ్ ఎండెడ్ ఫండ్లు నిర్ణీత కాలపరిమితితో మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. గ్రోత్ ఫండ్లు, ఇన్కమ్ ఫండ్లు, లిక్విడ్ ఫండ్లు, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్లు ఉంటా యి. స్వల్ప కాల లక్ష్యాలకు, ఎమర్జెన్సీ ఫండ్ లాంటి అవసరాలకు లిక్విడ్ ఫండ్స్ బెటర్. అలాగే మూడేండ్ల కాల పరిమితికే డెట్ ఫండ్లు అధిక రాబడులను ఇవ్వగలవు. ఐదేండ్లు ఆపై కాల పరిమితికి ఈక్విటీ ఫండ్లు, హైబ్రిడ్ ఫండ్లు ఉత్తమ మదుపు సాధనాలు.
ఇక ఏ మ్యూచువల్ ఫండ్లోనైనా ఏక మొత్తంగా మదుపు చేయడంతోపాటు నెలకు కనీసంగా రూ.500లతో మదుపు చేసే పద్ధతి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్లున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో నిపుణులైన ఫండ్ మేనేజర్లు మన పెట్టుబడులను మన తరఫున నిర్వహిస్తారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, వారి రిసెర్చ్ అనుభవంతో వివిధ ఆర్థిక సాధనాల్లో మదుపు చేస్తారు. డైవర్సిఫికేషన్, థీమాటిక్ పద్ధతులతో మ్యూచువల్ ఫండ్లలో నష్టపోవడానికి అవకాశాలు తక్కువ.
నేరుగా మదుపు
దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో మదుపు మిగతా అన్ని అసెట్ క్లాస్లకన్నా అధిక రాబడులను పొందవచ్చుననేది చారిత్రక సత్యం. కానీ మనకు మార్కెట్ ఒడిదుడుకులపైనా, స్టాక్స్, వాటి ఫండమెంటల్స్పైనా పూర్తి అవగాహన అవసరం.
ఇక్కడ మీ నష్టాలకు మీరే బాధ్యులు. స్టాక్స్లో నేరుగా మదుపు చేయడం సొంతంగా కారును డ్రైవ్ చేయడం లాంటిదే. స్టాక్ మార్కెట్ ఉత్థాన-పతనాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకోగలిగే ఎమోషనల్ సామర్థ్యాలు తప్పక ఉండాలి. అలాగే చేసిన ఇన్వెస్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించే సమయం, ఓపిక సైతం మీకుండాలి. పోర్టుఫోలియో డైవర్సిఫికేషన్తోపాటు రిస్క్ మేనేజ్మెంట్ విద్య కూడా తెలిసుండాలి. పోర్టుఫోలియోలలో 15 కంటే మించి స్టాక్స్ను నిర్వహించడం వ్యక్తిగా కష్టసాధ్యం. అయితే కంపెనీల ఫండమెంటల్, టెక్నికల్ విశ్లేషణల మీద మంచి పట్టు ఉంటే సొంతంగా కూడా పోర్టుఫోలియోను నిర్వహించుకోవచ్చు. మార్కెట్ భారీ పతనం అవుతున్నప్పుడు, లేదా బేర్ మార్కెట్ కరెక్షన్ల సమయాల్లో ప్రధాన సూచీలు ఒక శాతం నష్టపోతే, స్టాక్స్ మూడు శాతంపైగా సగటున నష్టపోతాయి. ఉదాహరణకు ప్రస్తుతం ప్రధాన సూచీ నిఫ్టీ గరిష్ఠ స్థాయి నుంచి 13 శాతమే కరెక్షన్కు గురైంది. కానీ ముఖ్యమైన షేర్లు కూడా 30 నుంచి 50 శాతం వరకు నష్టపోయాయి. ఇలాంటి సమయాల్లో మార్కెట్లో మదుపు కత్తిమీద సాము లాంటిది.
ఇదీ.. ఉత్తమం
స్టాక్ మార్కెట్లు.. మ్యూచువల్ ఫండ్లు.. రెండు వేర్వేరు ఆర్థిక మదుపు సాధనాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మదుపు సాధనాలను ఎంచుకోవాలి. లక్ష్యాలకు అనుగుణంగా నిలకడగా రాబడులను ఆశించడానికి మ్యూచువల్ ఫండ్లలో అనేక సాధానాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని షేర్ల ఎంపికలో, పన్ను ఆదా, ఎమర్జెన్సీ ఫండ్ లాంటి దీర్ఘకాల లక్ష్యాల సాధనకు మ్యూచువల్ ఫండ్లలో మదుపే ఉత్తమ వ్యూహం.