హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రోజులు గడుస్తున్నకొద్దీ రాజకీయ నాయకుడికి పరిణతి పెరగాలి.. మాట్లాడే ముందు అది నిజమో.. అబద్ధమో ఆలోచించుకోవాలి. పాడిందే పాటరా.. అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేస్తే కుదరదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో మాత్రం ఈ పరిణామాలేవీ కనిపించటం లేదు. ఓవైపు ఉద్యోగులను రెచ్చగొట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన అమలు కాకుండా చూస్తూ.. మరోవైపు నోటిఫికేషన్లు రావడం లేదంటూ నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నాడు.
నోటిఫికేషన్లను అడ్డుకుంటున్నది ఎవరు?
పాత జోనల్ విధానంలో నాన్లోకల్ క్యాటగిరీతో తీవ్ర నష్టం కలుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. స్థానికేతరులకు జిల్లాస్థాయిలో 20 శాతం, జోనల్ స్థాయిలో 30 శాతం, రాష్ట్ర స్థాయిలో 40 శాతం కోటా ఉండటంతో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించారు. దీంతో 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే దక్కేలా నూతన జోనల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల విభజనను ప్రారంభించింది. ఇది పూర్తికాగానే దాదాపు 60 వేల ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇన్ని పోస్టులు భర్తీ చేస్తే రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో రాష్ట్ర బీజేపీ నేతలు 317 జీవోను అడ్డం పెట్టుకొని ఉద్యోగులను రెచ్చగొట్టారు.
ఇప్పుడు కోటి సంతకాల సేకరణ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారు. ఎన్డీయే ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ‘గడిచిన ఏడేండ్లలో ఎన్నికోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందో బండి సంజయ్ స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15.62 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆర్మీలో 2 లక్షలు, రైల్వేలో 3 లక్షలు, బ్యాంకుల్లో 41 వేల ఖాళీలు ఉన్నాయి. దమ్ముంటే వీటిని భర్తీ చేయాలి’అ అని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగులు ఎక్కువ.. నిరుద్యోగం తక్కువ
అనేక రాష్ర్టాలతో పోల్చితే ఉద్యోగుల సంఖ్య తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నది. అదే సమయంలో నిరుద్యోగ శాతం తెలంగాణలోనే చాలా తక్కువ. జాతీయ సగటులో మూడింట ఒకవంతు మాత్రమే ఉన్నది వాస్తవం కాదా? జనాభాలో ఎంత శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? అని చూస్తే.. తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. రాష్ట్ర జనాభాలో 3 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇది ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కేవలం 1.1 శాతం మాత్రమే. బీజేపీ పాలిత కర్ణాటకలో 1.2 శాతం ఉంటే, బీహార్లో కేవలం 0.3 శాతం ఉన్నది. పశ్చిమ బెంగాల్లో ఒక శాతం, తమిళనాడులో 2 శాతం జనాభా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగ శాతం తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నదని ఈనెల 20న విడుదలైన సీఎంఐఈ నివేదిక స్పష్టం చేస్తున్నది. దేశవ్యాప్తంగా 7.91 శాతం నిరుద్యోగం ఉంటే.. తెలంగాణలో ఇది కేవలం 2.2 శాతం మాత్రమే అని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ స్పష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది ఉద్యోగాలు లేక అల్లాడుతున్నట్టు వెల్లడించింది.
సూటి ప్రశ్నలు
1) ఏటా 2 కోట్ల లెక్కన ఏడేండ్లలో 14 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేశారా? జాబితా విడుదల చేయగలవా?
2) దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయించగలరా?
3) కేంద్రం విచ్చలవిడిగా ప్రభుత్వరంగం సంస్థలు అమ్మేస్తుండటంతో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలతోపాటు రిజర్వేషన్ కోల్పోతున్నారు. వాటిని తిరిగి సాధించగలరా?
4) ఉద్యోగుల పొట్ట కొట్టకుండా.. నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేలా ఎల్ఐసీ వంటి మంచి ప్రభుత్వరంగ సంస్థల నుంచి వాటాల విక్రయాన్ని అడ్డుకోగలరా?
5) రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తూ.. రాష్ట్రంలో ఓవైపు 317 జీవోను అడ్డుపెట్టుకొని ఉద్యోగులను, ఖాళీల భర్తీ పేరుతో నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నది వాస్తవం కాదా?