న్యూఢిల్లీ, జనవరి 17: ఫుట్పాత్లపై నివసించే నిరాశ్రయులైన చిన్నారులకు పునరావాసం కల్పించాలని సుప్రీంకోర్టు మరోసారి నొక్కిచెప్పింది. ఈ విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సీరియర్గా తీసుకోవాలని, సుప్రీంకోర్టు గత ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొన్నది. జువైనల్ జస్టిస్ పోలీసు యూనిట్లను ఏర్పాటు చేయాలని, నిరాశ్రయులైన చిన్నారులను గుర్తించేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ(డీఎల్ఎస్ఏ), స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. పిల్లల సమాచారాన్ని రాష్ట్ర వెబ్పోర్టల్లో పొందుపరిచే ముందు జాతీయ పిల్లల హక్కుల సంరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్)తో సంప్రదించాలని పేర్కొన్నది. ఈ అంశంపై మూడు వారాల్లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని అన్ని రాష్ర్టాలు, యూటీలను ఆదేశించింది.
ఒక్క కంప్యూటర్ కొనలేరా?
కేసుల వర్చువల్ విచారణకు న్యాయవాదులు మొబైల్ ఫోన్ల ద్వారా హాజరుకావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వలన విచారణ సమయంలో లాయర్లను చూడడం లేదా వారి వాదనలు వినడంలో ధర్మాసనానికి ఇబ్బందిగా ఉన్నదని పేర్కొన్నారు. ‘సమస్య ఏంటి? మీరు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్లో ఉన్నారు. ప్రతి రోజూ విచారణలో కనిపిస్తున్నారు. కనీసం ఒక్క కంప్యూటర్ కొనలేరా?’ అని జస్టిస్ రమణ ఓ కేసు విచారణ సమయంలో ఒక న్యాయవాదిని ప్రశ్నించారు. పలు ఇతర కేసుల్లో కూడా లాయర్లు ఇలా ఫోన్ల ద్వారా హాజరైన నేపథ్యంలో ‘ఫోన్ల ద్వారా వర్చువల్ విచారణకు హాజరుకావడాన్ని నిషేధించాలని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.