పీపీఏ రద్దు ప్రతిపాదనకు పంజాబ్ ప్రభుత్వం ఆమోదం
న్యూఢిల్లీ: ఇన్ఫ్రా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీవీకే గ్రూప్నకు దెబ్బ తగిలింది. ఈ గ్రూప్ కంపెనీ జీవీకే పవర్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) పంజాబ్ ప్రభుత్వం రద్దుచేసింది. ప్రతిపాదనకు శనివారం పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఆమోదముద్ర వేశారు. జీవీకే పవర్.. గోయిండ్వాల్ సాహిబ్లో నెలకొల్పిన బొగ్గు ఆధారిత ప్రాజెక్టు నుంచి సరఫరా అయ్యే విద్యుత్కు అధిక టారీఫ్లను వసూలు చేస్తున్న కారణంగా పీపీఏను రద్దుచేశారు. ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించిన స్థిర టారీఫ్ యూనిట్కు రూ.1.61కాగా, పీపీఏలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం గతేడాది యూనిట్కు రూ.7.52 ధరను ప్రభుత్వం చెల్లించాల్సివచ్చింది. విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు సీఎం చెప్పారు.