ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 24 : రాష్ట్రంలో గిరిజన అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ యూనివర్సిటీస్ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ (తూటా) నూతన కార్యవర్గానికి తూటా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించి, విశ్వవిద్యాలయాలలో ఉద్యోగం చేస్తున్న ప్రొఫెసర్లు తండాలకు తోచిన సహాయం చేయాలని సూచించారు. తూటా రాష్ట్ర కార్యవర్గ అభినందన సభను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సీతారాంనాయక్ హాజరయ్యారు. తూటా నూతన అధ్యక్షుడు ప్రొఫెసర్ భీమానాయక్ అధ్యక్షత వహించిన ఈ సభలో ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తూటా పురుడు పోసుకుందని గుర్తు చేశారు. అనంతరం ప్రొఫెసర్ భీమానాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం తూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ భీమానాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీను నాయక్, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ నరసింహ, డాక్టర్ సుశీల, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బలరాం, డాక్టర్ చిన్న సైదులు, డాక్టర్ రాజు పాడియా, కోశాధికారి డాక్టర్ శ్రీనివాస్నాయక్ తదితరులను సభ్యులు ఘనంగా సన్మానించారు.