హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో ప్రస్తుత పరిస్థితికి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అనాలోచిత విధానాలే కారణమని తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కా ర్యదర్శి మోహన్రెడ్డి విమర్శించారు. బాయిల్డ్ రైస్ను కేంద్రం కొన కపోతే రాష్ట్రంలో 1,000 బాయిల్డ్ రైస్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మా రుతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ధాన్యం లెక్కలు సరిగా లేవంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన తప్పుబట్టారు. ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎమ్మార్కు అవసరమైన ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉన్నదని, ఎంతకావాలంటే అంత సరఫరా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్సీఐ గోదాముల్లో స్థలం చూపించకపోతే మి ల్లర్లు ధాన్యాన్ని ఏ విధంగా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఎఫ్సీఐ గోదాముల నిల్వ సామర్థ్యం 20 లక్షల టన్నులు కాగా ఇప్పటికే 19.70 లక్షల టన్నుల ధాన్యంతో నిండుగా ఉన్నదని వివరించారు. గోదాముల్లో సుమారు 30 వేల టన్నులకు మించి స్థలంలేదని పేర్కొన్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు.
నిందలేయొద్దు
మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యార న్న ఆరోపణల్లో నిజం లేద ని మోహన్రెడ్డి అన్నారు. పరిశ్రమపై అనవసరంగా నిందలు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతే ముందుగా ఇబ్బంది పడేది మిల్లర్లేనని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ధాన్యం కొనుగోలు చేస్తేనే రైస్ మిల్లులు నడుస్తాయని చెప్పారు.
ఎగుమతులపై దృష్టిపెట్టాలి
దేశంలో ఉత్పత్తి అవుతున్న 20 శాతం మిగులు ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అంశంపై దృష్టి సారిస్తే సమస్య తీరు తుందని మోహన్రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో క్వింటా ధాన్యం రూ. 1,500 ఉండగా మద్దతు ధర 1,960 ఉన్నదని, ఈ వ్యత్యాసాన్ని కేంద్రం భరించాలని సూచించారు. తెలంగాణ నుంచి అదనంగా 50 లక్షల టన్నుల ధాన్యం ఎగుమతి చేయవచ్చని పేర్కొన్నారు. ఎగుమతుల అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని కోరారు.