న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఉక్రెయిన్లో భారత విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. భారత్ దూరంగా ఉందన్న సాకుతో ఆ దేశ సైనికులు, సిబ్బంది మన విద్యార్థులపై ప్రతీకార వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ యూఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానానికి భారత్ దూరంగా ఉన్నది. దౌత్య మార్గాలు, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్తూ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. దీంతో తమ దేశానికి మద్దతు తెలపలేదన్న కారణంతో భారత విద్యార్థులపై ఉక్రెయిన్ సైనికులు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. రష్యాతో యుద్ధం ప్రారంభమైన వెంటనే ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేసింది. యుద్ధం నేపథ్యంలో మన దేశ విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సరిహద్దుల ద్వారా పక్కనున్న దేశాలకు చేరుకొంటున్నారు. ఈ క్రమంలో సరిహద్దు వద్ద వేచిఉన్న భారత విద్యార్థులపై ఉక్రెయిన్ సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. కాళ్లతో తంతూ, లాఠీలతో దాడి చేస్తూ, దారుణంగా దూషిస్తున్నారు. కారం పొడి, పెప్పర్ స్ప్రేలతో దాడి చేశారు. ముందుగా పోలాండ్లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చి, తర్వాత నిరాకరించటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిండి లేక, తాగడానికి మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ‘సరిహద్దు వద్ద ఉక్రెయిన్ అధికారులను సంప్రదించేందుకు భారత రాయబార కార్యాలయం నుంచి ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు. ఫోన్ చేసినా స్పందన లేదు. నేను సరిహద్దు దాటేందుకు అవకాశం వచ్చినా, నా తమ్ముడు మాత్రం అక్కడే చిక్కుకుపోయాడు. తిరిగి కాలేజీ హాస్టల్కు వెళ్లిపోవాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నది’అని సందీప్ కౌర్ అనే విద్యార్థిని తెలిపారు.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు నలుగురు కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్లనున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపాలని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కేంద్రమంత్రులు హర్దీప్ పూరీ, జ్యోతిరాధిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్ను పంపనున్నట్లు తెలిసింది. రొమేనియా, మాల్దోవాకు సింధియా, స్లొవేకియాకు కిరెన్ రిజిజు, హంగేరీకి పూరీ, పోలాండ్కు వీకే సింగ్ వెళ్తారు. కీవ్ రైల్వే స్టేషన్లో భారతీయ విద్యార్థులను రైలు నుంచి నెట్టేస్తున్న వీడియోలు తెగ వైరల్ అయింది.
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్లో మరో 489 మంది సోమవారం స్వదేశానికి వచ్చారు. దీంతో మూడు రోజులుగా కొనసాగుతున్న భారతీయుల తరలింపు ప్రక్రియలో ఇప్పటి వరకు ఆరు విమానాల ద్వారా దేశానికి చేరుకున్న వారి సంఖ్య 1,396కి చేరింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధమేఘాల నేపథ్యంలో భారత్ జారీచేసిన మొదటి అడ్వైజరీ తర్వాత దాదాపు 8 వేల మంది ఉక్రెయిన్ను వీడారని తెలిపింది.
బెరెగ్సురానీ: ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో యురోపియన్ యూనియన్ దేశాలకు భారీ సంఖ్యలో వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది ఉక్రెయిన్ను వీడినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రష్యా దాడుల్లో 102 సామాన్య పౌరులు మరణించినట్టు వెల్లడించింది.
మాస్కో: రష్యాలోని తమ జాతీయులకు అమెరికా విదేశాంగ శాఖ కీలక సూచన చేసింది. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో తక్షణం రష్యాను వీడాలని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొన్నది. అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా వెళ్లిపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెందిన లగ్జరీ విహార నౌక గ్రేస్ఫుల్ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకొన్నారు. మారిటైమ్ ట్రాఫిక్ డాటాను హ్యాక్ చేసి పుతిన్ నౌక ధ్వంసమైందని అందులో పేర్కొన్నారు. స్నేక్ ఐల్యాండ్లో నౌక మునిగిపోయినట్టు ట్రాఫిక్ డాటాలో నిక్షిప్తం చేశారు. సముద్రాల్లో నౌకల మార్గాలను ట్రాక్ చేయడానికి వినియోగించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను మార్చడం ద్వారా హ్యాకర్లు ఈ పనిచేశారు.