ఎల్బీనగర్, ఫిబ్రవరి 20: మామిడి క్రయవిక్రయాలకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధం అవుతోంది. గడ్డిఅన్నారంలోని పండ్ల మార్కెట్ బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కుకు మారిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో లాజిస్టిక్ పార్కులోనే మామిడి క్రయ విక్రయాలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 18 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకొని సుమారు రూ.3 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జి కార్యదర్శి చిలుకా నర్సింహారెడ్డి తెలిపారు.
సర్వం సన్నద్ధం..
ఈ ఏడాది మామిడి అమ్మకాలను బాటసింగారంలోనే నిర్వహించాలని.. ఇందుకు తగ్గ ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వసతుల కల్పనకు నడుం బిగించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న షెడ్లకు అదనంగా 1.08 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో ఆరు షెడ్లను నిర్మిస్తున్నారు. తాగునీటి వసతి కోసం ఆరు ట్యాంకులు, ఆర్ఓ ప్లాంట్, ఐదు బ్లాకుల్లో 20 టాయిలెట్లు, రైతులు, హమాలీల విశ్రాంతి కోసం పదివేల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో షెడ్లు వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వే బ్రిడ్జికి తోడు మరొకటి నిర్మిస్తున్నారు. యార్డులో 24 గంటల పాటు విద్యుత్ సదుపాయం, ప్రస్తుతం యార్డులో పని చేస్తున్న 20 మంది సెక్యూరిటీ గార్డులకు తోడు మరో 20 మంది గార్డులను నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యార్డు మొత్తం 118 లైట్లు, రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఆలస్యమయ్యే అవకాశాలు..
ఈ సంవత్సరం మామిడి సీజన్ మార్చి 15 నుంచి ఆరంభం అవుతుందన్న అంచనాలో అధికారులు ఉన్నారు. మామిడి పూత ఆలస్యంగా రావడం ఇందుకు కారణంగా వివరిస్తున్నారు. భారీ వర్షాలతో దిగుబడి తగ్గే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. బాటసింగారం మార్కెట్కు మహబూబ్నగర్, నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటుగా కృష్ణా, అనంతపూర్ నుంచి ఎక్కువగా మామిడి పండ్లు రానున్నాయి. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ర్టాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రస్తుతం బాటసింగారంలో సుమారు 90 నుంచి 110 మంది కమీషన్ ఏజెంట్లు వ్యాపారాలు చేస్తుండగా.. ఇందులో కొందరు రైతులకు నేరుగా కొనుగోలుతో పాటు అమ్ముకునే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్కు 100 క్రేట్ల సరుకు వస్తున్నది. క్వింటాల్(100 కిలోలు) ధర రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది.
వచ్చే ఏడాది కోహెడలోనే..
వచ్చే ఏడాది కోహెడలోనే క్రయ విక్రయాలు జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్కెట్ యార్డుకు వెళ్లే 100 ఫీట్ల రోడ్డు పనులకు రెండు రోజుల క్రితమే మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు శంకుస్థాపన చేశారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కు ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాం. మామిడి అమ్మకాలు, కొనుగోళ్లు సజావుగా సాగేందుకు 18 ఎకరాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఈ సంవత్సరం మామిడి పూత తక్కువగా ఉన్నందున దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మార్చి 15నుంచి మామిడి మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– నర్సింహారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ ఇంచార్జి కార్యదర్శి