హైదరబాద్: ఈ నెల 9వ తేదీన సైదాబాద్లోని ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన నిందితుడు రాజు కోసం తెలంగాణ అంతటా పోలీసులు జల్లెడ పట్టారు. నిందితుడు ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు ఆ దిశగా అన్ని రైల్వే స్టేషన్ల పట్టాలపై గాలించారు. కాగా ఊహించినట్లే స్టేషన్ఘన్పూర్ వద్ద కోనార్క్ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రైల్వే కార్మికులు 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.
కాగా చేతిపై పచ్చబొట్టు ఆధారంగా మృతదేహం రాజుదిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి మృతదేహాన్ని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వైద్యశాల ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం పోలీసులు మృతుడి బంధువులకు శవాన్ని అప్పగించారు. అనంతరం వరంగల్ లోని పోతనగర్ శ్మశానవాటికలో రక్తసంబంధీకులు అంత్య క్రియలు నిర్వహించారు.