హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై హత్యాచారానికి పాల్పడిన షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్కు కింది కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ముద్దాయిలకు క్షమాభిక్ష ప్రసాదించరాదని, తుదిశ్వాస విడిచే వరకు (జీవించిన ఉన్నంతకాలం) వారు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. 2019 నవంబర్లో జరిగిన ఈ హత్యాచార కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ 2020లో తీర్పు వెలువరించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. ఆ తీర్పు ఖరారు నిమిత్తం కేసును హైకోర్టుకు నివేదించింది. కింది కోర్టు తీర్పును ముద్దాయిలు కూడా సవాలు చేయడంతో ఆయా వ్యాజ్యాలపై జస్టిస్ పీ నవీన్రావు, జస్టిస్ జువ్వాది శ్రీదేవితో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది.
ముద్దాయిలకు నేరచరిత్ర లేకపోయినప్పటికీ కామవాంఛతోనే మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ అకృత్యం బట్టబయలవుతుందన్న భయంతోనే ఆమెను హత్య చేశారని పేర్కొన్నది. ఇలాంటి కిరాతకులను ఉరి తీసేందుకు చట్టాలు వీలుకల్పిస్తున్నప్పటికీ ఉరిశిక్షపై న్యాయమూర్తులు, శాసనకర్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపింది. హతురాలి భర్త, పిల్లల బాధ వర్ణనాతీతమే అయినప్పటికీ ముద్దాయిలకూ భార్యా, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ముద్దాయిల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు అందరూ ప్రయత్నించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడింది. అందుకే వారికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తున్నామని హైకోర్టు తన తీర్పులో వివరించింది.