హైదరాబాద్ : శాస్త్ర,సాంకేతిక రంగాలు ఎంతో వృద్ధి చెందినా అడవుల్లో ఆదివాసి, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకు పెరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమయంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశస్త్యం మరింత పెరిగిందన్నారు.
ఇలాంటి వైద్యాన్ని తగిన రీతిలో గుర్తించి, భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలన్నారు. ఆదివాసీ సంప్రదాయక వైద్యరీతులపై బుధవారం ఆన్ లైన్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జాతీయ వర్క్ షాప్లో మంత్రి సత్యవతి పాల్గొని ప్రసంగించారు.
ప్రకృతిలో దొరికే మూలికల ద్వారా జరిగే వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఉండవని, అందుకే దీనికి ఇప్పుడు ఆదరణ బాగా పెరుగుతుందన్నారు. అడవుల్లో దొరికే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ప్రమాదం వచ్చినప్పుడు ప్రకృతి వైద్యం పొందడం వల్ల మంచి జీవన ప్రమాణాలతో వందేళ్లకు పైగా జీవించారన్నారు.
ఈ ఆహార విధానాన్ని, వైద్యాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం దీనిపై మరింత పరిశోధన చేయాలన్నారు. స్థానిక యువతకు అవగాహన కల్పించి సంరక్షించాలన్నారు. కొత్త, కొత్త రోగాలు, జబ్బులు వస్తున్న నేపథ్యంలో ఆ ఆదివాసీ,గిరిజన వైద్యం ద్వారా పరిష్కారం వస్తుందా? అనేది పరిశీలించాలన్నారు.
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు. సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అధికారులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.