ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ ఉచితంగా సేవలతోపాటు మందులు అందజేయనున్నారు. దీంతో గ్రామీణులకు దూరభారం తగ్గడంతోపాటు రూపాయి ఖర్చు లేకుండా సేవలందుతున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలను ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 178, మహబూబ్నగర్లో 129, జోగుళాంబ గద్వాల జిల్లాలో 78, వనపర్తి జిల్లాలో 65, నారాయణపేట జిల్లాలో 43తో కలిపి మొత్తం 493 పల్లె, బస్తీ దవాఖానలు మంజూరయ్యాయి. డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. వ్యాధి ముదిరిన రోగులను సమీపంలోని పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తుండడంతో అక్కడి వైద్యులు చికిత్సలు అందించి నయం చేస్తున్నారు. అవసరమైన వారికి టీహబ్ డయాగ్నొస్టిక్ సెంటర్లోఉచితంగా టెస్టులు కూడా చేస్తున్నారు.
మహబూబ్నగర్, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామీణులకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె దవాఖానలకు పచ్చజెండా ఉపింది. హైదరాబాద్లో బస్తీ దవాఖానలు సక్సెస్ కావడంతో.. పల్లెలకు విస్తరించాలని నడుం బిగించింది. పల్లె దవాఖానల పేరుతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో వీటిని నెలకొల్పుతున్నారు. ఈ దవాఖానల్లో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. పల్లె దవాఖానలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. ఇంకా చాలా గ్రామాల్లో వైద్య సేవలకు నాటువైద్యులు, ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోగం ముదిరాక ప్రైవేట్ దవాఖానల్లో చేరి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పల్లెదవాఖానల్లో వైద్య సేవలతోపాటు మందులు ఉచితంగా అందజేస్తున్నది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. అవసరమైన వారికి టీ హబ్లో ఉచితంగా వివిధ రకాల టెస్టులు కూడా చేయిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది నుంచి ఇప్పటివరకు 493 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 178, మహబూబ్నగర్లో 129, జోగుళాంబ గద్వాలలో 78, వనపర్తి జిల్లాలో 65, నారాయణపేట జిల్లాకు 43 పల్లె, బస్తీ దవాఖానలు మంజూరయ్యాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బందికి నోటిఫికేషన్ వేసి కాంట్రాక్ట్ పద్ధతిన రిక్రూట్ చేస్తున్నారు. కలెక్టర్లు ప్రతి అప్లికేషన్ను పరిశీలిస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థుల సామర్థ్యాలను గుర్తించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అలాగే దవాఖానలకు అవసరమైన భవనాలను డీఎంహెచ్వోలు సిద్ధం చేస్తున్నారు. మందులు, ఇతర సామగ్రిని సమకూరుస్తున్నారు.
ప్రభుత్వం పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తుంది. జిల్లాలో అవసరం ఉన్న చోట వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే బస్తీ దవాఖానలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. చాలా మందికి వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఎంబీబీఎస్, బీఎఎంస్ డాక్టర్లను నియమిస్తున్నాం. ఇమ్యూనైజేషన్, ఇతర వైద్య సదుపాయాలు అందిస్తున్నాం. సబ్సెంటర్లలో ఏ విధమైన వైద్య సేవలందుతున్నాయో అవన్ని ఇక్కడ చేస్తున్నాం. వైద్య సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాం.
– డాక్టర్ రవిశంకర్, జిల్లా వైద్య అధికారి, వనపర్తి