నిజామాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు తథ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాకమునుపు, వచ్చిన తర్వాత అనేక రకాల ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. రెఫరెండం అని ఎవరు పడితే వారు అంటే కుదరదని చెప్పారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పే రెఫరెండమని అన్నారు. పశ్చిమ బెంగాళ్లో మమతా బెనర్జీ గెలుపును బీజేపీ రెఫరెండంగా తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పును రెఫరెండంగా తీసుకుంటే ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు కావాలని చెప్పారు. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.
రెండు దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానాన్ని సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించదగినదని పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాల ద్వారా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. సింహ గర్జన నుంచి వచ్చే నెలలో తలపెట్టిన విజయ గర్జన వరకు టీఆర్ఎస్ గమనం ఎనలేనిదని చెప్పారు. ప్రభుత్వ పనితీరుతో దేశానికి రోల్ మోడల్గా నూతన రాష్ట్రం నిలబడటం సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర స్వప్నానికి నిదర్శనం అని చెప్పారు. కరోనా మూలంగా పెట్టుబడులు తిరిగి వెళ్తున్న ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కవిత వివరించారు. టీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ నాయకత్వంలో నిరంతరం ప్రజలకు ఏమి కావాలో చర్చ జరుగుతుంటుందని అన్నారు.
ప్రజలు చెప్పేది టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని, మిగిలిన వారు అలా చేయకపోవడం మూలంగానే ఆపార్టీలు కనుమరుగు అయ్యారని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం పెడితే ఒడిస్సాతో పాటు ఏడెనిమిది రాష్ట్రాల్లో అమలు చేశారన్నారు. షీ టీమ్లు 20 రాష్ట్రాల్లో అమలవుతుందన్నారు. హుజురాబాద్లో గెలవబోయేది ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవేనని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రత్యేకంగా చూడాల్సిన ఎన్నిక కాదన్నారు. అన్ని ఎన్నికల మాదిరిగానే హుజురాబాద్లో ఎలక్షన్ నడుస్తోందని చెప్పారు. ఆడబిడ్డల కోసం కేసీఆర్ మేలు చేస్తుంటే… గ్యాస్ ధరలు పెంచి ఆడబిడ్డలపై బరువు మోపుతున్న పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో పుట్టి, పెరిగి తిరిగి అదే పార్టీని శాపనార్థాలు పెట్టిన వాళ్లెవరూ బాగుపడలేదన్నారు. వరంగల్లో తలపెట్టిన విజయ గర్జన సభను విజయవంతం చేయాలని శ్రేణులకు కవిత పిలుపునిచ్చారు.