హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో దాదాపు 73.39 లక్షల ఓట్లు పక్కాగా గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనామలీస్ జాబితాలో ఉన్న 61 లక్షల మంది ఓట్లతోపాటు మరో 20 లక్షల వరకు ఓట్లు తొలగింపునకు గురయ్యే పరిస్థితులున్నాయి. అం టే రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకుపైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం (సీఈవో) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 2,64,87,214 మంది (78.30 శాతం) ఎన్యుమరేషన్ ఫారం (ఈఎఫ్)లను డిజిటలైజ్ చేశారు. అంటే రాష్ట్రంలో ని ప్రతి నలుగురు ఓటర్లలో ముగ్గురి ఈఎఫ్లు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి.
మిగిలిన 73,39,234 మంది (21.70 శాతం) ఓటర్ల ఈఎఫ్లను అధికారులు సేకరించలేకపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో చనిపోయినవారు, అందుబాటులో లేనివారు, ఆచూకీ లేనివారు, శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోయినవారు, ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారితోపాటు ఈఎఫ్లను తిరిగి ఇవ్వనివారు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈఎఫ్లు సమర్పించలేకపోయిన ఓటర్లలో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారిగా నమోదయ్యారు. వీరిని ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి తెలంగాణలో ఓటు నమోదు చేసుకుకుని, ఆ హక్కును వదులుకున్నవారిగా అధికారులు భావిస్తున్నారు. వీరంతా తమ సొంత ప్రాంతాల్లోనే ఓటు హక్కును కలిగి ఉం డేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్తున్నారు.
ఎన్యుమరేషన్ దశ పూర్తయిన నేపథ్యంలో డిజిటలైజ్ అయిన 2.64 కోట్ల ఈఎఫ్లు, సేకరించలేకపోయిన 73.39 లక్షల ఈఎఫ్లకు సంబంధించిన తదుపది దశపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటివరకు డిజిటలైజ్ అయిన ఈఎఫ్లన్నీ సక్రమంగా ఉన్నట్టు కాదని, సేకరించలేకపోయిన ఈఎఫ్లన్నీ పోయినట్టు కాదని సీఈవో కార్యాలయ అధికారులు చెప్తున్నారు. ఓటరు జాబితాలో ఉన్న ఏ ఒక్కరినీ తొలగించబోమని, అనామలిస్ జాబితాలో 60 లక్షల పైచిలుకు ఓట్లు కూడా రద్దు కావని తెలిపారు. ఈ నెల 17న పోలింగ్ బూత్లవారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. ఆ జాబితాలో పేర్లు లేనివారందరికీ నోటీసులు జారీచేస్తామని వెల్లడించారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలను, ఆధారాలను సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో పే రు కల్పిస్తామని చెప్పారు. నోటీసులు, అభ్యంతరాలకు నెల రోజుల సమయం ఉంటుందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే తుది ఓటరు జాబితాలపై స్పష్టత వస్తుందని వివరించారు.
మరణించినవారు 9,22,230
అందుబాటులో లేని/ ఆచూకీ లేనివారు 11,25,546
శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు 45,18,961
ఇప్పటికే ఓటర్లుగా నమోదైనవారు 6,70,203
ఇతర కారణాలు 1,02,294
మొత్తం 73,39,234