హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఘన్శ్యామ్దాస్ జెమ్స్ అండ్ జ్యుయెల్స్పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. బ్యాంకుల నుంచి మోసపూరితంగా రుణాలను తీసుకోవడమేగాక, వాటిని ఎగవేసి, ఆ సొమ్ముతో ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల్ని ఈ సంస్థ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి ఎస్బీఐ నుంచి కంపెనీ ఎండీ సంజయ్ అగర్వాల్ మొత్తం రూ.90 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ సొమ్ముతో సంజయ్ 250 కిలోల బంగారాన్ని కొనుగోలు చేయగా, ఆ తర్వాత స్థానిక మార్కెట్లో విక్రయించారు. ఆ డబ్బుతో 2012లో తన భార్య పేరు మీద ఓ దుకాణం, సోదరుల పేరుపై మూడు దుకాణాలు ప్రారంభించినట్టు ఈడీ తెలిపింది. ఇంకొంత సొమ్మును తన కుటుంబ సభ్యులకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్నది.
సంజయ్ అగర్వాల్.. శ్రీకాంత్ గుప్తా పేరుతో నకిలీ పాస్పోర్టును తీసుకుని పలుమార్లు విదేశాలకు వెళ్లినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అక్కడ కూడా కొన్ని బ్యాంకు ఖాతాలు తెరిచినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఆధారాల సహాయంతోనే ఈడీ అధికారులు సంజయ్ అగర్వాల్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 11న సంజయ్ అగర్వాల్కు చెందిన రూ.9.5 కోట్ల విలువైన తొమ్మిది స్థిరాస్తులనూ జప్తు చేశారు.