తాండూర్ : తాండూర్ మండలం బోయపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి ఆర్టీసీ బస్సులో
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రామస్తులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల నుంచి కాగజ్నగర్ వెళ్తున్న మంచిర్యాల డిపో పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు బోయపల్లి గ్రామ శివారుకు వచ్చే సరికి బ్యాటరీలో షార్ట్ సర్క్యుట్తో మంటలు చెలరేగాయి. డ్రైవర్ దీనిని గమనించకుండానే బస్సును నడపడంతో అక్కడే ఉన్న గ్రామస్తులు మంటలు గమనించి బస్సు వెంట పరిగెత్తి డ్రైవర్ను అప్రమత్తం చేశారు.
దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి చాకచక్యంగా బ్యాటరీల కనెక్షన్ తొలగించారు. గ్రామస్తుల సహకారంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే బస్సులో నుంచి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపివేశారు. ఈ ప్రమాదంలో మంటలు ఆర్పి వేసిన అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ప్రయాణికులను కాపాడిన బోయపల్లి గ్రామస్తులకు పలువురు అభినందనలు తెలిపారు.